రిజిస్ట్రార్‌ జనరల్‌ నుంచే నేరుగా తాజా జాబితా | Facility to remove names of deceased voters from time to time | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రార్‌ జనరల్‌ నుంచే నేరుగా తాజా జాబితా

May 2 2025 2:14 AM | Updated on May 2 2025 7:48 AM

Facility to remove names of deceased voters from time to time

కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం 

మృతిచెందిన ఓటర్ల పేర్లను ఎప్పటికప్పుడు తొలగించే వెసులుబాటు 

అత్యంత నవీకరించిన ఓటర్ల జాబితాకు అవకాశం

న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు పాత పేర్ల తొలగింపు, సవరణలతో అత్యంత కచ్చితత్వంతో ఆధునీకరించిన ఓటర్ల జాబితాను సిద్ధంచే సేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మృతిచెందిన ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితా నుంచి వెనువెంటనే తొలగించాలని నిర్ణయించింది. ఎవరైనా ఓటర్‌ మృతిచెందితే అధికారికంగా తమకు సమాచారం వచ్చేదాకా వేచిచూడకుండా నేరుగా ‘రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా’నుంచి మరణాల తాజా జాబితాను తెప్పించుకుని ప్రస్తుత ఓటర్ల జాబితాతో సరిపోల్చి మృతుల పేర్లను తొలగించనుంది. దీంతో మృతుల పేరిట మరొకరు ఓటు వేసే ఆస్కారం లేకుండా చేయాలని ఎలక్షన్‌ కమిషన్‌ భావిస్తోంది. దీంతోపాటు మరికొన్ని కీలక నిర్ణయాలను ఈసీ తీసుకుంది. అవి.. 

1. నమోదిత మరణాల తాజా జాబితా రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా నుంచి అందగానే బూత్‌ స్థాయి అధికారి(బీఎల్‌ఓ)కి సమాచారం ఇస్తారు. ఫామ్‌–7 అభ్యర్థన కోసం వేచిచూడకుండా నేరుగా రిజిస్ట్రార్‌ జనరల్‌ నుంచి ఈ జాబితా తెప్పించుకోవచ్చు. తర్వాత మరణాన్ని ధృవీకరించుకునేందుకు ఆ బీఎల్‌ఓ సదరు ప్రాంతానికి వెళ్లి మృతి విషయాన్ని ఖరారుచేసుకుంటారు. ఓటర్ల నమోదు నియమావళి–1960లోని 9వ నిబంధన, 2023లో సవరించిన జనన, మరణాల నమోదు చట్టం–1969లోని 3(5)(బీ) సెక్షన్‌ ప్రకారం ఆయా జనన, మరణాల వివరాలు అడిగి తీసుకునే హక్కు ఈసీకి ఉంది.  

2. ఓటర్‌ ఇన్ఫర్మేషన్‌ స్లిప్‌(వీఐఎస్‌) మరింత స్పష్టంగా ఉండేందుకు ప్రస్తుతమున్న దాని డిజైన్‌ను మార్చనున్నారు. ఇకపై పెద్ద అక్షరాలతో డిజైన్‌ చేయడం వల్ల వీఐఎస్‌ సీరియల్‌ నంబర్, ఓటర్‌ పార్ట్‌నంబర్‌ మరింత స్పష్టంగా కనిపిస్తాయి. దీంతో తమ పోలింగ్‌ స్టేషన్‌ ఎక్కడుందో ఓటర్‌ మరింత తేలిగ్గా చూసుకోగలడు. పోలింగ్‌ అధికారులు సైతం ఆయా ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితాలో ఏ పేజీలో ఉన్నాయో సులభంగా గుర్తుపట్టగలరు. 
 


3. ప్రజా ప్రతినిధుల చట్టం,1950లోని 13బీ(2) సెక్షన్‌ ప్రకారం ఎలక్టోరల్‌ రిజి్రస్టేషన్‌ ఆఫీసర్‌ నియమించిన బీఎల్‌ఓలు అందరికీ ప్రామాణికమైన ఫొటో గుర్తింపు కార్డులను జారీచేయనున్నారు. ఓటర్‌ వెరిఫికేషన్, నమోదు కార్యక్రమాల్లో బీఎల్‌ఓలను ఓటర్లు సులభంగా గుర్తించడానికి, వారితో ఎలాంటి నిర్మొహమాటం లేకుండా సందేహాలు నివృత్తిచేసుకోవడానికి, అభ్యంతరాలు వ్యక్తంచేయడానికి వీలు చిక్కుతుంది. ముఖ్యంగా బీఎల్‌ఓలు ఇంటింటికీ తిరిగే క్రమంలో వారిని ఓటర్లు తేలిగ్గా గుర్తుపట్టడానికి ఈ నూతన ప్రామాణిక గుర్తింపు కార్డు తప్పనిసరి అని ఈసీ భావిస్తోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement