చుట్టుముట్టి చంపేశారు | eyewitness account of Pahalgam terror attack | Sakshi
Sakshi News home page

చుట్టుముట్టి చంపేశారు

Apr 30 2025 6:07 AM | Updated on Apr 30 2025 6:07 AM

eyewitness account of Pahalgam terror attack

రెండు వైపులా దిగ్బంధం చేసి దారుణంగా దాడి చేసిన వైనాన్ని వివరించిన ప్రత్యక్ష సాక్షులు

శ్రీనగర్‌: తాజాగా మరికొంత మంది ప్రత్యక్ష సాక్షుల కథనాలతో పహల్గాంలోని బైసారన్‌లో ముష్కరుల కిరాతకకాండపై జాతీయ దర్యాప్తు సంస్థకు మరింత స్పష్టత వస్తోంది. అమాయకులను ముష్కరులు చుట్టుముట్టి చంపేశారని తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారం.. బైసారన్‌ గడ్డి మైదానం లోపలికి వెళ్లడానికి, బయటకు రావడానికి ఒక ఎంట్రీ మార్గంతోపాటు ఒక ఎగ్జిట్‌ దారి ఉంది. ఈ రెండు చోట్లా ఉగ్రవాదులు నిలబడి మైదాన ప్రాంతం నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. సుదూరంగా ఉన్న వాళ్లు కళ్లుగప్పి, ఫెన్సింగ్‌ దాటి ఎలాగోలా తప్పించుకున్నా మిగతా వాళ్లు మధ్యలోనే చిక్కుకుపోయి ఉగ్రతూటాలకు బలయ్యారని తెలుస్తోంది. ఎగ్జిట్‌ గేట్‌ వద్ద ఒక ఉగ్రవాది నిలబడి కాల్పులు మొదలెట్టాడు.

దీంతో జనం భయపడి ఎంట్రీ గేట్‌ వైపు పరుగులు పెట్టారు. అయితే అప్పటికే ఎంట్రీ గేట్‌ వద్ద ఇద్దరు ఉగ్రవాదులు ఉన్నారు. మరో ఉగ్రవాది చెట్లలో దాక్కున్నట్లు తెలుస్తోంది. కాల్పులు జరుపుతున్న ఈ ముగ్గురు ఉగ్రవాదులకు ఏమైనా జరిగితే రంగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాడని అర్థమవుతోంది. ఈ ముగ్గురు మాత్రమే పర్యాటకుల ప్రాణాలుతీశారు. వీరిలో ఇద్దరు భారత సైనిక యూనిఫామ్‌లో, ఒకడు కశ్మీరీ స్థానిక దుస్తుల్లో ఉన్నాడు. ఎగ్జిట్‌ గేట్‌ వద్ద తుపాకీ మోతతో ఎంట్రీ గేట్‌ వైపు పరుగెత్తుకొచ్చిన వాళ్లందర్నీ అక్కడి ఇద్దరు ఉగ్రవాదులు నిలువరించి మహిళలు వేరుగా నిలబడాలని ఆదేశించారు.

భయపడుతున్నా ఎవ్వరూ వేరు వేరుగా నిలబడలేదు. దీంతో హిందూ, ముస్లింలుగా వేర్వేరుగా నిలబడాలని మరోసారి ఆదేశించారు. దీంతో ఇస్లామ్‌పై విశ్వాసం ఉందని ప్రకటించే ‘కల్మా’ను పఠించాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే ఎంట్రీ గేట్‌ నుంచి వచి్చన యువ నేవీ అధికారి, లెఫ్టినెంట్‌ వినయ్‌ నర్వాల్‌ ఉగ్రతూటాలకు బలయ్యారని సాక్షులు తెలిపారు. 

రెండు వారాల ముందే రెక్కీ? 
ఉగ్రవాదులు సమీప హోటళ్లలో పర్యాటకులతో నిండిపోయాయా లేదా? అనే వివరాలను తెల్సుకున్నారని, ఇందుకోసం రెండు వారాల ముందే రెక్కీ నిర్వహించారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయాన్ని నిర్ధారించుకునేందుకు సమీప హోటళ్లు, రహదారి వెంట అమర్చిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 

జిప్‌లైన్‌ ఆపరేటర్‌కు ఎన్‌ఐఏ సమన్లు 
రిషీ భట్‌ అనే పర్యాటకుడు జిప్‌లైన్‌ ఎక్కి బైసారన్‌ ఏరియల్‌ వ్యూను తన కెమెరాలో బంధించిన సందర్భంగా జిప్‌లైన్‌ ఆపరేటర్‌ వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉండటం ఆ వీడియోలో రికార్డయింది. అల్లా హు అక్బర్‌ అని పదేపదే అతను పలకడం అందులో రికార్డయింది. పర్యాటకుడిని జిప్‌లైన్‌లో ముందుకు తోస్తూ అలా పలకాల్సిన అవసరం ఏమొచి్చందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో దాడి విషయం ముందే తెలుసా? అనే కోణంలో వివరణ కోరుతూ ఎన్‌ఐఏ ఇతనికి సమన్లు జారీచేసింది.  

రెండ్రోజుల క్రితమే హతమార్చేవారా? 
ఏప్రిల్‌ 22వ తేదీన ఈ దాడి జరిగింది. వాస్తవానికి రెండు రోజుల ముందే ఉగ్రవాదులు దాడికి ప్రయతి్నంచారని తెలుస్తోంది. అయితే ఆ ముందు రెండు రోజులు అంటే 20, 21వ తేదీల్లో అక్కడ వర్షం పడటంతో బైసారన్‌ గడ్డిమైదానం అంతా బురదమయంగా ఉండటంతో పర్యాటకులు హోటళ్లను వదిలి బయటకు రాలేదని, సందడి లేకపోవడంతో ఉగ్రవాదులు తమ ప్రయత్నాన్ని వాయిదావేసుకున్నారని తెలుస్తోంది. 22వ తేదీన చక్కటి ఎండ కాయడంతో జనం పెద్ద సంఖ్యలో వచ్చారు. 

ఘటన జరిగిన రోజున బైసారన్, సమీప ప్రాంతాల్లో ఏకంగా 5,000 మంది స్థానిక, స్థానికేతరులు ఉన్నారని ‘పోనీ ఆపరేటర్‌’రౌఫ్‌ వానీ చెప్పారు. ఆ విషయం ఉగ్రవాదులు తెల్సుకుని తెగబడ్డారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అక్కడి ఫుడ్‌స్టాళ్ల వెనక వైపు చాలా సేపు ఇద్దరు ఉగ్రవాదులు ఊరకనే కూర్చుని మధ్యాహ్నం 2.30 గంటలకు జనం ఎక్కువైన తర్వాతే ముందువైపుకొచ్చి దాడి చేసినట్లు తెలుస్తోంది. ముందుగా ఇద్దరు ఉగ్రవాదులు నలుగురిని తలపై గురిచూసి చంపేశాకే అక్కడి జిప్‌లైన్‌ వెనుక నుంచి మరో ఇద్దరు వచ్చారని ఇంకొందరు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement