ఢిల్లీ అగ్నిప్రమాద ఘటనలో హృదయ విదారక దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘‘ఆమె వీల్ఛైర్లో కూర్చుని ఉంది. ఆమె పక్కనే కుర్చీలో ఉన్న వ్యక్తి ఆమెను గట్టిగా కౌగిలించుకోగా.. ఆమె తన తలను అతని భుజంపై ఆనించింది. రక్షణ కోసం ఎదురుచూస్తూనే.. వారు ఒకరి చేతుల్లో ఒకరు ప్రాణాలు విడిచారు. వీల్ఛైర్లో ఒకరు.. చేతులు గట్టిగా పట్టుకుని మరో జంట.’’ సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బందికి కన్పించిన దృశ్యాలు వారిని కంటతడి పెట్టించింది.
బుధవారం ఉదయం ఢిల్లీలోని 'ఫ్లరిష్ స్టే బిఎన్బి' హోటల్లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 12 మంది విదేశీయులతో సహా మొత్తం 21 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ మహిళ టాయిలెట్ సీటుపై కూర్చుని ఉండగా.. ఆ పురుషుడు ఆమె పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుని ఆమెను గట్టిగా పట్టుకుని ఉన్నాడు. మంటల నుండి తప్పించుకోవచ్చనే ఆశతో వారు లోపల తాళం వేసుకున్నట్లు తెలుస్తోందని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. మరో గదిలో బెడ్ అంచున కూర్చుని ఉన్న ఒక జంట కనిపించింది. వారిద్దరూ పూర్తిగా కాలి బూడిదయ్యారని లోపల దృశ్యాలు చాలా భయానకంగా ఉన్నాయన్నారు.
బేస్మెంట్ (భూగర్భ గది) ద్వారా భవనంలోకి ప్రవేశించాం. హోటల్లోకి ప్రవేశించడానికి తాము షట్టర్ను కట్ చేశాం. బేస్మెంట్లోకి ప్రవేశించినప్పుడు, రిసెప్షన్ సమీపంలో పూర్తిగా కాలిపోయిన మొదటి మృతదేహాన్ని చూశాం. అది 20 ఏళ్ల వయసున్న అమ్మాయిది. ఆమె చేతులు, కాళ్లు బిగుసుకుపోయి ఉన్నాయి. ఆమె అక్కడికక్కడే మరణించింది. అక్కడి నుండి కొన్ని అడుగుల దూరంలో, వీల్చైర్పై ఉన్న ఒక వ్యక్తి కూడా కాలి చనిపోయి కనిపించాడు. మేం ముందుకు వెళ్లినప్పుడు.. ముగ్గురు విదేశీయులు స్పృహ తప్పి పడి ఉండటం చూసి వారికి సీపీఆర్ చేశామని రెస్క్యూ సిబ్బంది గుర్తు చేసుకున్నారు.


