ఢిల్లీ బాబా ఆగ్రాలో అరెస్ట్‌ | Delhi Baba Swami Chaitanyananda Arrested from Agra | Sakshi
Sakshi News home page

ఢిల్లీ బాబా ఆగ్రాలో అరెస్ట్‌

Sep 28 2025 10:03 AM | Updated on Sep 29 2025 5:53 AM

Delhi Baba Swami Chaitanyananda Arrested from Agra

చైతన్యానంద సరస్వతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

17 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు

న్యూఢిల్లీ/ఆగ్రా: ఢిల్లీలోని ఓ ప్రైవేట్‌ సంస్థకు చెందిన 17 మంది విద్యార్థినులను వేధించిన ఆరోపణలను ఎదుర్కొంటున్న బాబా చైతన్యానంద సరస్వతి(62) జాడను ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు కనిపెట్టారు. ఆగ్రాలోని ఓ హోటల్‌లో బస చేసిన అతడిని ఆదివారం వేకువజామున అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి ఒక ఐపాడ్, మూడు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక ఫోన్‌లో ఢిల్లీలోని విద్యాసంస్థ క్యాంపస్, హాస్టల్‌లోని సీసీటీవీ ఫుటేజీని యాక్సెస్‌ చేసే సౌకర్యం ఉండటం గమనార్హం. 

ఈ ఫోన్‌ ద్వారానే విద్యార్థినుల కదలికలను చైతన్యానంద గమనించేవాడని పోలీసులు తెలిపారు. ప్రధానమంత్రి కార్యాలయంలో తనకు పరిచయస్తులున్నారని చెప్పుకుంటూ చైతన్యానంద, అతడి శిష్యులు అరెస్టుల నుంచి తప్పించుకుంటున్నారని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. కేసు నమోదు కావడంతో అరెస్ట్‌ భయంతో ఆగస్ట్‌ 4వ తేదీన ఢిల్లీని దొంగచాటుగా వదిలిన చైతన్యానంద, ఇతడి శిష్యులు పోలీసుల కళ్లలో పడకుండా ట్యాక్సీల్లో ప్రయాణిస్తూ, చౌక హోటళ్లలో బస చేస్తూ బృందావన్, ఆగ్రా, మథుర తదితర ప్రాంతాల్లో తిరుగుతున్నారన్నారు. 

చైతన్యానంద వద్ద ఐక్యరాజ్యసమితి రాయబారిని, బ్రిక్స్‌ కమిషన్‌ సభ్యుడని చెప్పుకుంటూ ముద్రించిన రకరకాల నకిలీ విజిటింగ్‌ కార్డులు ఇతడి వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఆగ్రా హోటల్‌లో ఈ నెల 27వ తేదీన సాయంత్రం 4 గంటలకు పార్థసారథి అనే పేరుతో చైతన్యానంద గది తీసుకున్నాడన్నారు. వేర్వేరు పేర్లతో ఇతడు తీసుకున్న రూ.8 కోట్ల బ్యాంకు అకౌంట్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను పోలీసులు స్తంభింపజేశారు. 

ఢిల్లీలోని మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌కు గతంలో చైర్మన్‌గా ఉన్న చైతన్యానంద మహిళా విద్యార్థినులను రాత్రి వేళ గత క్వార్టర్‌కు పిలిపించుకునే వాడు. రాత్రిళ్లు వారికి అసభ్యకర సందేశాలను పంపించేవాడు. తన ఫోన్‌లో వారి కదలికలను గమనించేవాడు. కేసు నమోదైనట్లు తెలిసిన తర్వాత బ్యాంకు నుంచి రూ.50 లక్షలను విత్‌డ్రా చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

ఐదు రోజుల పోలీస్‌ కస్టడీ
చైతన్యానంద సరస్వతిని ఢిల్లీ కోర్టు ఆదివారం ఐదు రోజుల పోలీసు కస్టడీకి అనుమతించింది. చైతన్యానంద పలువురు విద్యార్థినులను వేధించాడని, తన కోరిక తీర్చాలని ఒత్తిడి చేసేవాడని పలువురు బాధితులకు పోలీసులకిచ్చిన వాంగ్మూలంలో ఆరోపించారు. విద్యార్థినుల బాత్‌రూంలలోనూ ఇతడు సీసీటీవీ కెమెరాలను అమర్చాడని బాధితుల తరఫు లాయర్లు ఆరోపించారు. 

సుమారు 16 మంది పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇతడి బారిన 16 నుంచి 20 మంది విద్యార్థినులు పడ్డారన్నారు. వీరందరి స్టేట్‌మెంట్లు పోలీసులు రికార్డు చేశారని తెలిపారు. పోలీసుల విచారణకు సహకరించడం లేదని, ఐపాడ్, ఐక్లౌడ్‌ పాస్‌వర్డులను వెల్లడించడం లేదని ఆరోపించారు. అయితే, పోలీసులు తనను వేధించేందుకే కస్టడీ కోరుతున్నారని, నిజంగా తనతో ప్రమాదముంటే జ్యుడీషియల్‌ కస్టడీకి పంపించాలని చైతన్యానంద తరపు లాయర్‌ వాదించారు. వాదనలు విన్న డ్యూటీ మేజిస్ట్రేట్‌ రవి ఐదు రోజుల పోలీస్‌ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement