సాక్షి, ఢిల్లీ: ఉన్నావ్ అత్యాచార కేసు విచారణ ఇవాళ సుప్రీం కోర్టులో జరగనుంది. ఈ కేసులో దోషిగా తేలిన ఉత్తర ప్రదేశ్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ జీవిత ఖైదును ఢిల్లీ హైకోర్టు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇది రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపింది.
ఈ బెయిల్ను సవాల్ చేస్తూ సీబీఐ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. దీనిని కాసేపట్లో కోర్టు విచారణ జరపనుంది. ఈ కేసులో సెంగార్కు ఇటీవల బెయిల్ లభించటం సంచలనంగా మారింది. బెయిల్పై అతడు బయటకు రావటంతో.. బాధితురాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తనతో పాటు ఇంటివద్ద ఉన్న తన పిల్లలకు కూడా రక్షణ లేకుండా పోయిందని వాపోయారు.
‘సుప్రీంకోర్టులో న్యాయం దక్కుతుందన్న నమ్మకముంది. అతడికి బెయిల్ రాకుండా ఉండాల్సింది. నా తండ్రిని, కుటుంబాన్ని కోల్పోయాను. ఇప్పుడు నా పిల్లల భద్రత కూడా ప్రమాదంలో పడింది’ అంటూ బాధితురాలు వాపోతున్నారు. బాధితురాలి భద్రత దృష్ట్యా బెయిల్ రద్దు చేయాలని సీబీఐ తన పిటిషన్లో పేర్కొంది. ఈ పిటిషన్ విచారణలో సెంగార్ తరఫు వాదనలు ఎలా ఉండనున్నాయో అనే ఉత్కంఠ నెలకొంది.


