యూపీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్‌ దూరం | Congress Party decides not to contest UP bypolls | Sakshi
Sakshi News home page

యూపీ ఉప ఎన్నికలకు కాంగ్రెస్‌ దూరం

Oct 25 2024 6:10 AM | Updated on Oct 25 2024 6:10 AM

Congress Party decides not to contest UP bypolls

తొమ్మిది స్థానాల్లోనూ పోటీ చేయనున్న ఎస్పీ 

సీట్లు కాదు..గెలుపే ముఖ్యమన్న అఖిలేశ్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టకూడదని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న తొమ్మది స్థానాలను ఇండియా కూటమిలో భాగంగా ఉన్న సమాజ్‌వాదీ పారీ్టకే వదిలేయడంతో పాటు ఆ పార్టీ అభ్యర్థులకే మద్దతివ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు కాంగ్రెస్‌ నిర్ణయం చేసిందని ఆ రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌ అవినాష్‌ పాండే గురువారం తెలిపారు. 

నిజానికి çపాండే ప్రకటనకు ముందే ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ఉప ఎన్నికల్లో మొత్తం తొమ్మిది స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులందరూ తమ పార్టీ ఎన్నికల గుర్తు ’సైకిల్‌’పై పోటీ చేస్తారని ప్రకటించారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు ఐక్యంగా ఉన్నాయని, భారీ విజయం కోసం భుజం భుజం కలిపి పనిచేస్తాయని, ఈ ఎన్నికల విజయంతో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తామని ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. అఖిలేశ్‌ ప్రకటన అనంతరం కాంగ్రెస్‌ తన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించింది. నిజానికి ప్రస్తుతం ఎన్నికలు జరుగనున్న 9 స్థానాలకు గానూ కాంగ్రెస్‌ 5 స్థానాలను ఆశించింది. 

దీనిపై చర్చలు కొనసాగుతుండగానే 6 స్థానాల్లో ఎస్‌పీ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన మూడు స్థానాల్లో ఘాజియాబాద్, ఖైర్‌ స్థానాల్లో కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు సుముఖత తెలిపింది. అయితే ఈ రెండు స్థానాల్లోనూ గెలుపు అవకాశాలు లేకపోవడం, బీజేపీకి మెరుగైన అవకాశాలు ఉండటంతో ఈ స్థానాల్లో పోటీ చేయకూడదని కాంగ్రెస్‌ నిర్ణయించుకుంది. తమ నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ‘ఇండియా కూటమి 9 స్థానాల్లో పోటీ చేస్తోంది. మాకు గుర్తు ముఖ్యం కాదు..బీజేపీ దుష్పరిపాలన అంతం ముఖ్యం. శాంతి భద్రతలు ముఖ్యం‘అని రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌రాయ్‌ పేర్కొన్నారు. దీనికి కౌంటర్‌గా బదులిచ్చిన బీజేపీ, ‘కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌’నినాదాన్ని ఎస్పీ నిజం చేస్తోందని ఎద్దేవా చేసింది.  
 

Advertisement
 
Advertisement
Advertisement