‘మీరు అమ్మిన భూములను మేము వెనక్కి తీసుకోవాలా?’ | Congress MP Mallu Ravi Slams KTR | Sakshi
Sakshi News home page

‘మీరు అమ్మిన భూములను మేము వెనక్కి తీసుకోవాలా?’

Apr 3 2025 8:14 PM | Updated on Apr 3 2025 8:30 PM

Congress MP Mallu Ravi Slams KTR

ఢిల్లీ:  బీఆర్ఎస్ అమ్మిన భూముల్ని తాము ఎలా వెనక్కి తీసుకుంటామని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. హెచ్‌సీయూకు సంబంధించి భూముల్ని వెనక్కి తీసుకోవాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎలా అడుగుతున్నారని ధ్వజమెత్తారు. ‘ మీరు(బీఆర్ఎస్) అమ్మిన భూముల్ని మేము  వెనక్కి తీసుకోవాలా?,  చట్టం అడ్డు వస్తుందనే కామన్ సెన్స్ లేకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారు.

చట్ట పరంగా జరిగే నిర్ణయాలను ఎవరూ అడ్డుకోలేరు. హెచ్‌సీయూ భూములను మేము అభివృద్ధికి ఉపయోగిస్తాం. హెచ్‌సీయూ భూములను కాజేయాలని బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ మా ప్రభుత్వం న్యాయ పోరాటం చేసి భూములను స్వాధీనం చేసుకుంది.  బిల్లీ రావుకు చంద్రబాబు అప్పనంగా భూములు  కట్టబెట్టారు’ అని మల్లు రవి విమర్శించారు.

కాగా, హెచ్‌సీయూ భూముల వివాదంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. గురువారం హెచ్ సీయూ భూముల వివాదంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. పర్యావరణ విధ్వంసాన్ని చాలా తీవ్రమైన విషయంగా పరిగణించాలని స్పష్టం చేసింది.   కంచ గచ్చిబౌలి భూముల్లో చెట్లు నరికివేత సహా అన్ని పనులను తక్షణమే నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

వరుసగా మూడు రోజులు సెలవు రావడంతో పోలీసుల సాయంతో హెచ్‌సీయూ భూముల్లో పెద్ద ఎత్తున చెట్లు నరికేశారని ఫిర్యాదు సుప్రీం కోర్టుకు చేరింది. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నాం తర్వాత జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement