సాక్షి, చెన్నై : రాజ్యసభ, అసెంబ్లీ ఎప ఎన్నికలపై టీవీకే అధినేత, సీఎం విజయ్ దృష్టి పెట్టారు. ఈ రెండు స్థానాలను గుప్పెట్లోకి తెచ్చుకునే దిశగా కసరత్తులు మొదలయ్యాయి. అధికార పగ్గాలతో చరిత్ర సృష్టించిన తమ పార్టీ, రాజ్యసభలోనూ అడుగు పెట్టేందుకు మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే, తిరుచ్చి తూర్పులో జరగనున్న ఉప ఎన్నికలలో మాజీ ఐఏఎస్ అధికారి సహాయంను పోటీలో పెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్టు చర్చ జరుగుతోంది.
రాజ్యసభ గెలుపు సమీకరణాలు ఇవే..
అన్నాడీఎంకేకు చెందిన సీవీ షణ్ముగం రాజీనామాతో ఉప ఎన్నికల అనివార్యమైంది. జూన్ 1 నుంచి నామినేషన్లు, జూన్ 18న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి కసరత్తు మొదలెట్టారు. సాధారణంగా తమిళనాడు నుండి ఓ రాజ్యసభ సభ్యుడిని ఎన్నుకోవడానికి 34 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం అవుతుంది. అయితే, ప్రస్తుతం ఒకే ఒక్క స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుండటంతో, గెలుపునకు 50 శాతానికి పైగా ఓట్లు (అంటే 117 ఓట్లు) అవసరమవుతాయి. ప్రస్తుతం అసెంబ్లీలో మొత్తం 233 మంది సభ్యులు ఉన్నారు. (ముఖ్యమంత్రి విజయ్ తాను గెలిచిన రెండు స్థానాలలో ఒకటైన తిరుచ్చి తూర్పు నియోజకవర్గానికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది).
ప్రస్తుతం అధికార టీవీకే పార్టీకి 107 మంది సభ్యుల బలం ఉంది. కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్, వీసీకే , సీపీఎం,సీపీఐల మద్దతు ఇస్తే టీవీకే అభ్యర్థి విజయం నల్లేరుపై నడకే కానుంది. అటు అన్నాడీఎంకేలోని ఒక వర్గం మద్దతు కూడా విజయ్ పారీ్టకే ప్రస్తుతానికి ఉందని చెప్పవచ్చు. ఈ దృష్ట్యా ఈస్థానం కైవసానికి విజయ్ వ్యూహాలకు పదును పెట్టారు. కాంగ్రెస్లోని తన మిత్రుడు ప్రవీణ్ చవ్రర్తికి సీటు ఇస్తే కూటమి పార్టీలలో ఏదేని విబేధాలు తలెత్త వచ్చు అని భావిస్తున్నారు. దీంతో టీవీకేకు చెందిన ఒక ముఖ్య నేతను లేదా తమకు వెన్నంటి ప్రోత్సహం ఇచ్చిన అన్ని రంగాలలో నిష్ణాతుడైన ఓ ముఖ్య ప్రముఖుడ్ని రాజ్యసభకు పంపించేందుకు విజయ్ కసరత్తులు చేపట్టినట్టు టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి.
తిరుచ్చి తూర్పు ఉప ఎన్నికపై ఉత్కంఠ
మరోవైపు సీఎం విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక నగారా మోగనుంది. ఇక్కడ మాజీ ఐఏఎస్ అధికారి సహాయంను పోటీలో పెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. డీఎంకే తరపున ఇక్కడ మాజీ మంత్రి అన్బిల్ మహేశ్ పొయ్యామొళి పోటీ చేయవచ్చ అనే సంకేతాల నేపథ్యంలో బలమైన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు విజయ్ సిద్ధం అవుతున్నారు. తొలుత లాల్గుడిలో ఓడిన కూపా కృష్ణన్ పేరు వినిపించినా ఆయనకు బోర్డు పదవి దక్కింది. సినీ నటి త్రిషా పేరిట పోటీ అంటూ వస్తున్న ప్రచారానికి చెక్ పెట్టే దిశగా మాజీ ఐఏఎస్ అధికారులపై విజయ్ దృష్టి పెట్టి ఉన్నారు. నిజాయితీకి మారు పేరుగా ఉన్న సహాయం పోటీకి నిరాకరించిన పక్షంలో మరో ఐఏఎస్ అధికారి పోటీలో పెట్టేందుకు తగ్గ ప్రయత్నాలు సాగుతుండటం గమనార్హం.


