జీవితం అంటే కేవలం సోషల్ మీడియా రీల్స్ మాత్రమే కాదు. నేటి యువత, విద్యార్థులు మంచి రాజకీయాలపై అవగాహన పెంచుకోవాలి అని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, తమిళ హీరో కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. విల్లుపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈయన, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తనకు రాజకీయాలు నేర్పిన వారు, తన లాంటి వారు, తందై పెరియార్ చేసిన రాజకీయాలనే చేస్తున్నారని అన్నారు. అందుకే రాజకీయమే తన వృత్తిగా మార్చుకున్నానని పేర్కొన్నారు.
(ఇదీ చదవండి: ఆ ఒక్క కారణం వల్లే 'అబ్సెషన్' చూశారు)
తాను ప్రజల కోసం పనిచేయడానికి వచ్చానని చెప్పి నాటకాలు ఆడాలనుకోవడం లేదని అన్నారు. సమాజంలో అవినీతి ఉందని చెబితే సరిపోదని, ఎవరైనా లంచాలు తీసుకుంటుంటే, అందులో ఇచ్చే వారి ప్రమేయం కూడా ఉంటుందన్నారు. లంచం ఇస్తే, తీసుకునే చేయి మరింత బలపడుతుందని స్పష్టం చేశారు. తాను చిత్ర పరిశ్రమలోకి వచ్చినప్పుడు నేరుగా స్టార్గానో, దర్శకుడిగానో రాలేదన్నారు. తన కష్టార్జితం, అర్హతల వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని పేర్కొన్నారు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా తాను నేరుగా ముఖ్యమంత్రిగా రాలేదని, దానికి కావలసిన అర్హతలు తనకు వచ్చినప్పుడు, ప్రజలు తనకు ఆ పదవిని ఇస్తారని వ్యాఖ్యానించారు.
సోషల్ మీడియా రీల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మంచి, చెడు రెండూ ఉన్నాయని కమల్ హాసన్ వివరించారు. సాంకేతికతను నేర్చుకున్న వారు దానిని ఒక వ్యాపారంగా మార్చుకునేంత వరకు నేర్చుకుంటున్నారని చెప్పారు. యువత వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో మంచి రాజకీయ నాయకుడు ఎవరో గుర్తించే వయసుకు తమరు చేరుకున్నారని ఆయన పేర్కొన్నారు.
(ఇదీ చదవండి: ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. మేకర్స్కి తమిళ నేత వార్నింగ్)


