– 20వ తేదీన నిరసన దీక్షకు పిలుపు
సాక్షి చైన్నె : తమిళనాడు వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఈ–సేవా కేంద్రాలు , శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాలు జూలై 20వ తేదీన పనిచేయవని తమిళనాడు డేటా ఎంట్రీ ఆపరేటర్ల సంఘం ప్రకటించింది. సంఘం రాష్ట్ర అధ్యక్షు డు గోపీ కుమార్, ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ ఈ మేరకు మాట్లాడుతూ తమిళనాడు ప్రభుత్వ కేబుల్ టీవీ సంస్థ పరిధిలోని ఈ– సేవా కేంద్రాలు, ఆధార్ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించే కాంట్రాక్ట్ సంస్థ.. ప్రతి నెలా వారి జీతాల నుంచి అక్రమంగా డబ్బులు కట్ చేస్తోందని వారు ఆరోపించారు. అంతేకాకుండా పీఎప్ ఈఎస్ఐ వంటి చట్టబద్ధమైన ప్రయోజనాలను కూడా సక్రమంగా అందించడం లేదని పేర్కొన్నారు.
నిరసన దీక్షకు పిలుపు
ఈ సమస్యపై రాష్ట్ర ముఖ్యమంత్రి, సమాచార సాంకేతిక మంత్రి వెంటనే జోక్యం చేసుకుని పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అలా గే ఈ–సేవా కేంద్రాల ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన నియమించాలనే ప్రధాన డిమాండ్తో జూలై 20న చైన్నెలో నిరసన దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రభుత్వ కేబుల్ టీవీ సంస్థ కింద పనిచేస్తున్న 600 మందికి పైగా సిబ్బంది పాల్గొననున్నారన్నారు. ఈ కారణంగా జూలై 20న తమిళనాడులోని అన్ని జిల్లా కలెక్టరేట్లు, తాలూ కా కార్యాలయాలు, కార్పొరేషన్, మున్సిపాలి టీ, జోనల్ కార్యాలయాల్లోని ప్రభుత్వ ఈ– సేవా కేంద్రాలు, ఆధార్ నమోదు కేంద్రాల సేవ లు పూర్తిగా స్తంభించనున్నట్లు తెలిపారు.
ఏఐఏడీఎంకేలోకి
భారీగా చేరికలు
సాక్షి,చైన్నె: తమిళనాడులో ఏఐఏడీఎంకే పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. కడలూరు జిల్లాకు చెందిన వివిధ ప్రతిపక్ష పార్టీలకు చెందిన వందలాది మంది నాయకులు, కార్యకర్తలు తమ పాత పార్టీలను వీడి ఏఐఏడీఎంకేలో చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే. పళనిస్వామి సమక్షంలో వీరంతా ఆదివారం అధికారికంగా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కడలూరు తూర్పు జిల్లా పార్టీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కె.ఎ. పాండియన్ ఆధ్వర్యంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. డీఎంకే, కాంగ్రెస్, విదుతలై చిరుతైగల్ కట్చి సహా పలు పార్టీలను వచ్చిన కీలక నేతలకు ఎడప్పాడి పళనిస్వామి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారంతా భవిష్యత్లో పార్టీ గెలుపు కోసం చురుగ్గా పనిచేయాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కార్యక్రమంలో కడలూరు జిల్లా పార్టీ జాయింట్ సెక్రటరీ రంగమ్మాళ్, ఐటీ వింగ్ సెక్రటరీ ఎల్లేరి ప్రభు, యూనియన్ సెక్రటరీ రంగసామి, ఆర్ట్ వింగ్ సెక్రటరీ ఇళంజెళియన్, యూనియన్ ప్రెసిడెంట్ గోవిందరాజ్, ట్రాన్స్పోర్ట్ వింగ్ జాయింట్ సెక్రటరీ సౌందరరాజన్, పరంగిపేట్టై టౌన్ సెక్రటరీ జైశంకర్ తదితరులు పాల్గొన్నారు.
పళనిలో వసతి గృహాల అద్దె పెంపు
తిరువొత్తియూరు: పళని ఆలయ వసతి గృహాల అద్దెను అకస్మాత్తుగా పెంచడంతో భక్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమిళనాడులో అత్యధిక సంఖ్యలో భక్తులు సందర్శించే ఆలయాల్లో పళని దండాయుధపాణి స్వామి ఆలయం ప్రధానమైంది. ఇక్కడికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు కొండ కింద అనేక వసతి గృహాలను ఏర్పాటు చేశారు. దండపాణి నిలయంలో గదుల అద్దె ఇదివరకు రూ.300 నుండి రూ.2,500 వరకు ఉండేది. కాగా, తాజాగా అద్దెలను 50 శాతం నుండి 75 శాతం వరకు పెంచుతూ ఆలయ యంత్రాంగం బోర్డులను ఏర్పాటు చేసింది. ధరల పెరుగుదల వివరాలు, కార్తికేయన్ వసతి గృహం ఇదివరకు రూ.300 ఉన్న అద్దెను 100 శాతం పెంచి రూ.600 చేశారు. గుహన్ ఇల్లం – రాజాలంకార ఇల్లం రూ.2,000 నుండి రూ.2,500 వరకు ఉన్న గదుల అద్దెను రూ.3,000 నుండి రూ.4,000 వరకు పెంచారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా అద్దెలు పెంచడం పట్ల భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని వారు కోరుతున్నారు.
నేను పారిపోలేదు..
– మాజీ మంత్రి ఎ.వి.వేలు
సాక్షి చైన్నె: ‘నేను క్రమం తప్పకుండా వెళ్లే వైద్య పరీక్షల కోసమే సింగపూర్ వెళ్లాను. విచారణ సంస్థల సమన్లకు నా లాయర్ ద్వారా సరైన సమాధానం ఇచ్చాను. ఇలాంటి పరిస్థితుల్లో నేను పారిపోయాను, దాక్కున్నాను అని కొందరు మాట్లాడటం అర్థరహితం అని డీఎంకే మంత్రి ఎ.వి.వేలు స్పష్టం చేశారు. సింగపూర్ పర్యటన ముగించుకుని చైన్నె చేరుకున్న ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. 2016 నుండి గుండె సమస్యల నిమిత్తం సింగపూర్లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని, ఈసారి కూడా అలర్జీ, నరాల సమస్యలు, గుండె పరీక్షల కోసమే ముందస్తు ప్రణాళికతో వెళ్లానని, అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులు తన వద్ద ఉన్నాయని తెలిపారు.
సోదాలకు పూర్తి సహకారం: జూన్ 25న తన నివాసంలో అవినీతి నిరోధక శాఖ శాఖ అధికారులు సోదాలు చేసినప్పుడు వారికి పూర్తి సహకారం అందించానని, ఆ తర్వాతే జూన్ 26న సింగపూర్ వెళ్లానని వివరించారు.


