ముగ్గురు పౌరుల అనుమానాస్పద మృతి | Civilians Killed In The Aftermath Of Poonch Terror Attack Were Tortured To Death - Sakshi
Sakshi News home page

ముగ్గురు పౌరుల అనుమానాస్పద మృతి

Dec 24 2023 6:13 AM | Updated on Dec 24 2023 12:10 PM

Civilians Killed in the Aftermath of Poonch Terror Attack Were Tortured to Death - Sakshi

జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దు జిల్లాలు పూంఛ్, రాజౌరీల్లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విచారణ కోసమని తీసుకెళ్లి ముగ్గురు పౌరులను ఆర్మీ అధికారులు చంపేశారంటూ పార్టీల నేతలు, స్థానికులు నిరసనకు దిగారు. దీనిపై ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలకు పరిహారం అందజేస్తామని, ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపింది. సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. విచారణకు పూర్తిగా సహకరిస్తామని ఆర్మీ ప్రకటించింది.

వదంతులు వ్యాపించకుండా పూంఛ్, రాజౌరీ జిల్లాల్లో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. ఈ నెల 21న పూంఛ్‌ జిల్లాలో ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు సైనికులు అసువులు బాయడం తెలిసిందే. అనంతరం ఆర్మీ అధికారులు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు శుక్రవారం రాత్రి శవాలై కనిపించారు. వారిని చిత్రహింసలు పెట్టిన వీడియోలు బహిర్గతమయ్యాయి. ఇది ఆర్మీ అధికారుల పనేనని స్థానికులు ఆరోపించారు. తీవ్ర గాయాలపాలైన నలుగురిని అధికారులు ఆస్పత్రికి తరలించారు.
కశ్మీర్‌లో మళ్లీ ఉద్రిక్తతలు
  

Advertisement
 
Advertisement
Advertisement