పొగాకు ఉత్పత్తుల ప్రకటనల్లో పాల్గొంటున్నందుకు.. | Central Consumer Protection Authority issued notices to the Bollywood actors | Sakshi
Sakshi News home page

పొగాకు ఉత్పత్తుల ప్రకటనల్లో పాల్గొంటున్నందుకు..

Dec 11 2023 5:24 AM | Updated on Dec 11 2023 8:32 AM

Central Consumer Protection Authority issued notices to the Bollywood actors - Sakshi

లక్నో: పొగాకు కంపెనీల తరఫున ప్రకటనల్లో కన్పిస్తున్న బాలీవుడ్‌ నటులు షారూక్‌ ఖాన్, అక్షయ్‌కుమార్, అజయ్‌ దేవ్‌గణ్‌లకు కేంద్రం నోటీసులు పంపింది. ప్రజల ఆరోగ్యానికి చేటు తెస్తున్న పొగాకు ఉత్పత్తుల ప్రకటనల్లో సెలబ్రిటీలు, ముఖ్యంగా పద్మ అవార్డు గ్రహీతలు నటిస్తుండటంపై మోతీలాల్‌ యాదవ్‌ అనే న్యాయవాది గతంలో అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది.

కేంద్రం స్పందించడం లేదని, ఇది ధిక్కరణేనని పిటిషనర్‌ మరోసారి కోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. షారూక్, అక్షయ్, అజయ్‌లకు సెంట్రల్‌ కన్జూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ అక్టోబర్‌ 20వ తేదీనే నోటీసులిచ్చిందని కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌బీ పాండే కోర్టుకు తెలిపారు. ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నందున పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. విచారణ 2024 మే 9కి వాయిదా పడింది.

Advertisement
 
Advertisement
Advertisement