న్యూఢిల్లీ: దేశంలోని విద్యార్థులకు శుభవార్త. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి బోర్డు పరీక్షల మూల్యాంకన విధానంలో కీలక మార్పును ప్రకటించింది. ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్న 2026 బోర్డు పరీక్షల సమాధాన పత్రాలను ‘ఆన్-స్క్రీన్ మార్కింగ్’ (OSM) విధానంలో దిద్దనున్నట్లు బోర్డు తెలిపింది. ఈ నూతన విధానంతో మార్కుల లెక్కింపులో పారదర్శకత పెరుగుతుందని సీబీఎస్ఈ పేర్కొంది. భారతదేశంతో పాటు 26 దేశాల్లోని దాదాపు 46 లక్షల మంది విద్యార్థుల కోసం ప్రతి ఏటా సీబీఎస్ఈ బోర్టు పరీక్షలు నిర్వహిస్తుంటుంది.
సీనియర్ సెకండరీ స్థాయికి పూర్తి డిజిటల్ మూల్యాంకనాన్ని అమల్లోకి తీసుకువచ్చిన సీబీఎస్ఈ ప్రస్తుతానికి 10వ తరగతి సమాధాన పత్రాలను పాత పద్ధతిలోనే (ఫిజికల్ మోడ్) దిద్దుతారని స్పష్టం చేసింది. డిజిటల్ మార్కింగ్ విధానం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని సీబీఎస్ఈ పరీక్షల నియంత్రణాధికారి సన్యం భరద్వాజ్ తెలిపారు. ఈ పద్ధతి ద్వారా మార్కుల లెక్కింపులో జరిగే పొరపాట్లు పూర్తిగా తొలగిపోతాయని, ఆటోమేటెడ్ వ్యవస్థ వల్ల మానవ ప్రమేయం తగ్గి, సమన్వయం వేగవంతం అవుతుందని ఆయన తెలిపారు.
ఉపాధ్యాయులు సమాధాన పత్రాలను దిద్దడానికి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, తమ పాఠశాలల్లోనే ఉంటూ విధులకు ఆటంకం కలగకుండా మూల్యాంకనం చేయవచ్చని భరద్వాజ్ తెలిపారు. దీనివల్ల రవాణా ఖర్చులు, సమయం ఆదా అవడమే కాకుండా, ఫలితాల తర్వాత మార్కుల ధృవీకరణ అవసరం కూడా ఉండదని స్పష్టం చేశారు. ఈ నూతన విధానాన్ని విజయవంతంగా అమలు చేయడానికి వీలుగా అనుబంధ పాఠశాలలన్నీ తగిన సాంకేతిక సదుపాయాలను సిద్ధం చేసుకోవాలని సీబీఎస్ఈ ఆదేశించింది. సీబీఎస్ఈ తీసుకున్న ఈ నిర్ణయంపై ఢిల్లీలోని ఐటీఎల్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ సుధా ఆచార్య స్పందిస్తూ, ఇది మానవ తప్పిదాలను తగ్గించే అద్భుతమైన పని విధానం అని అన్నారు.


