
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదం సందర్బంగా నివాసం ఉన్న వారు శిథిలాల కింద చిక్కుకుపోయారు. నలుగురు క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
వివరాల ప్రకారం.. నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని శీలంపూర్ ప్రాంతంలో ఉన్న జనతా మజ్దూర్ కాలనీలో ఈరోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్ ఇప్పటి వరకు నలుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం తీవ్ర గాయాలైన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అసలు బిల్డింగ్ కూలిన సమయంలో అందులో ఎంతమంది ఉన్నారు.. ప్రాణనష్టంపై తెలియరాలేదు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది..
#WATCH | Delhi: Locals help in clearing the debris after a ground-plus-three building collapses in Delhi's Seelampur. 3-4 people have been taken to the hospital. More people are feared trapped. https://t.co/VqWVlSBbu1 pic.twitter.com/UWcZrsrWOb
— ANI (@ANI) July 12, 2025