తిరువనంతపురం: శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయానికి మహిళల ప్రవేశం విషయంలో కేరళలోని ఎల్డీఎఫ్ (ఎల్డీఎఫ్) ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. గతంలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పించాలన్న తన పాత వైఖరిని మార్చుకుని, ఇప్పుడు ఆలయ సంప్రదాయాలు, ఆచారాలకే ప్రాధాన్యత ఇవ్వాలని నిశ్చయించింది. ఈ మేరకు శనివారం సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తన తాజా నిర్ణయాన్ని అధికారికంగా వివరించనున్నదని తెలుస్తోంది.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిందంటూ ‘మాతృభూమి’ తన కథనంలో పేర్కొంది. ఇటీవలే ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు కూడా శబరిమల పురాతన ఆచారాలను కాపాడాలని తీర్మానం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈ దిశగా అడుగులు వేసింది. మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో దీనిపై చర్చ జరిగినప్పటికీ, తుది నిర్ణయాన్ని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్)కు వదిలివేశారు. సీపీఎం నాయకత్వం, ఇతర మిత్రపక్షాలతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ నిర్ణయానికి ప్రభుత్వం మొగ్గు చూపింది.
గత ఎన్నికల్లో ఎదురైన పరాజయాలు, బీజేపీ తదితర ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయమూ తీసుకోకూడదని ఎల్డీఎఫ్ భావిస్తోంది. ఈ అంశంపై గతంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ ‘రాజ్యాంగబద్ధంగా నడిచే దేశంలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత. ఫలానా వారు ఆలయానికి వెళ్లకూడదని ఏ ఒక్క వర్గం నిర్ణయించలేదు’ అని ఆయన స్పష్టం చేశారు. అయితే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్ మాటలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ‘శబరిమలలోకి మహిళల ప్రవేశంపై మా వైఖరిలో మార్పు లేకపోయినా, ప్రస్తుత పరిస్థితులు, న్యాయపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ సెక్రటేరియట్ నిర్ణయించింది’ అని ఆయన పేర్కొన్నారు. ఏదిఏమైనప్పటికీ ఓటర్ల మనసు గెలుచుకోవడమే లక్ష్యంగా కేరళ సర్కార్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నదని విశ్లేషకులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: ‘ఉగ్గు’తో ఉసురు తీయకండి!


