రెండేళ్ల ప్రేమ, పెళ్లి మండపం నుంచి వరుడు పరార్.. పెళ్లి బట్టలతోనే రంగంలోకి నవ వధువు, ఏం చేసిందంటే...
చాలామంది పెళ్లి పేరుతో వంచన చేయడం లేదా పెళ్లి పేరెత్తగానే పరారవ్వడం చూస్తూనే ఉన్నాం! ఆ తర్వాత వధువు కుటుంబసభ్యులు భోరుమని కన్నీళ్లుపెట్టుకోవడం వంటి కథలు వింటున్నాం. మోసపోతే కన్నీళ్లతో కూలబడిపోవడం కాదని, తెగించి మరీ ఆ మోసగాడిని పట్టుకుని కిక్కురుమనకుండా చేయాలని నిరూపించింది ఓ లేడీ. పెళ్లిమండపం వద్ద భయానక చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న ఓ నవ వధువు చేసిన సాహసం చూసి ఆశ్చర్యపోక మానరు. ఆమెను ప్రశసించకుండా ఉండలేం.
ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఒక వధువు పెళ్లిరోజున వరుడు పెళ్లికి నిరాకరించి.. చెప్పపెట్టకుండా పెళ్లిమండపం నుంచి వెళ్లిపోయాడు. అతని కోసం ఎదురు చూస్తూ కూర్చొన్న పెళ్లి కూతురు ఈ షాకింగ్ ఘటనను జీర్ణించుకోలేకపోయింది. ఏదేమైనా తగ్గేదేలే! అని అతన్ని వెతికి తెచ్చి మరీ పెళ్లి చేసుకోవాలనుకుంది. అందుకోసం ఆమె పెళ్లి డ్రస్లోనే అతడిని వెదకడం ప్రారంభించింది. అమ్మను తీసుకురావడానికే వెళ్లానంటూ ఆ పెళ్లి కొడుకు ఫోన్లో చెప్పినా ఆమె నమ్మలేదు.
ఏకంగా 20 కిలోమీటర్లు చేజ్ చేసి మరీ అతడ్ని పట్టుకుంది. అతడు సరిగ్గా బరేలీ పోలీస్టేషన్ సమీపంలోని బస్సులో దొరికాడు. అతడ్ని పెళ్లిమండపానికి వెంట బెట్టుకుని తీసుకొచ్చింది. ఆ తర్వాత రెండు గంటల పాటు సాగిన నాటకీయ పరిణామాల అనంతరం ఇరువురు కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించి సదరు వధూవరులిద్దరికి పెళ్లి చేశారు.
నిజానికి ఆ యువతీయువకులు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సరిగ్గా పెళ్లి సమయానికి అతడు హ్యాండివ్వడంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఎలాగైనా వెతికి పట్టుకునైనా అతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని మరీ ఇంతటి సాహసం చేసింది. తన వివాహాన్ని నిలబెట్టుకునేందుకు ఆమె కనబర్చిన ధైర్యానికి అందరిచే ప్రశంసలు అందుకుంది.
(చదవండి: రూ.2 వేల నోటు మార్పిడికి తంటాలు)
సంబంధిత వార్తలు