
యశవంతపుర: రెండు వేల రూపాయల నోట్ను ఆర్బీఐ ఉపసంహరణ నేపథ్యంలో ప్రజల వద్ద ఉన్న ఆ నోట్లు బయటకు వెల్లువెత్తాయి. ఎక్కువగా పెట్రోల్ బంకుల వద్ద చలామణి అవుతున్నాయి. రెండు వేల నోటును తీసుకోవాలంటే కనీసం రూ. 1500 పెట్రోల్ వేయించుకోవాలని బంక్ యజమాన్యాలు బెంగళూరులో బోర్డులు పెట్టాయి. ఇలా ప్రజల అవసరాన్ని బంకుల యజమానులు సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.
అయితే రూ2 వేల నోటుకు వంద, రెండు వందలకు పెట్రోల్ వేసి చిల్లర ఇవ్వడం తమకు సమస్యగా ఉందని యజమానులు తెలిపారు. ప్రజలు కూడా వీలైనచోటల్లా తమ వద్దనున్న 2 వేల నోట్లను మార్చుకోవడానికి తంటాలు పడుతున్నారు. మెడికల్ షాపులు, ఆస్పత్రులు, బ్యాంక్లు, పెట్రోల్ బంకుల్లో నోటును బదిలీ చేసుకొంటున్నారు. పెట్రోల్ బంకుల్లో అయితే సులభంగా మార్చుకోవచ్చని ప్రజలు ఎక్కువగా వస్తున్నారు. దీంతో బంకులకు కాసుల పంట పండింది.