Bihar: ప్రధాని మోదీ దివంగత తల్లికి మళ్లీ అవమానం.. వీడియోను షేర్‌ చేసిన ఉపముఖ్యమంత్రి | Bihar Politics Heats Up: BJP Slams Tejashwi Yadav Over Remarks on PM Modi’s Late Mother | Sakshi
Sakshi News home page

Bihar: ప్రధాని మోదీ దివంగత తల్లికి మళ్లీ అవమానం.. వీడియోను షేర్‌ చేసిన ఉపముఖ్యమంత్రి

Sep 21 2025 11:31 AM | Updated on Sep 21 2025 12:30 PM

BJP claims abuses again hurled at PM Modis mother

పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్కడి రాజకీయ వాతావరణం మరింతగా వేడెక్కుతోంది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తన బీహార్ అధికార్ యాత్ర లో ప్రధాని మోదీ దివంగత తల్లిని మళ్లీ అవమానించారని బీజేపీ ఆరోపించింది. ఈ సంఘటనను బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇది బీహార్ సంస్కృతికి విరుద్ధమని పేర్కొన్నారు. కాగా దీనిపై ఆర్జేడీ ఇంకా అధికారిక ప్రతిస్పందన వెల్లడించలేదు.

తేజస్వి యాదవ్‌ పర్యటనలో ఆర్జేడీ కార్యకర్తలు దుర్భాషను ఉపయోగించారని బిజెపీ ఆరోపించింది. ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి తన ‘ఎక్స్‌’ హ్యాండిల్‌లో ఈ అరోపణలకు సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు. తేజస్వి యాదవ్ కార్యకర్తల వేధింపుల తీరును ప్రోత్సహిస్తున్నారని, ఈ తరహా ప్రవర్తన బీహార్ సంస్కృతిని నాశనం చేస్తున్నదని రాశారు. బీహార్‌లోని మహిళలు ఈ అవమానంపై ప్రజాస్వామ్య రీతిలో ప్రతిస్పందించాలని సామ్రాట్ చౌదరి పేర్కొన్నారు.
 

ఈ ఘటనను ప్రజాస్వామ్యానికి జరిగిన తీవ్ర అవమానంగా చౌదరి అభివర్ణించారు. మహిలలను అవమానించడం ప్రతిపక్షాలకు రాజకీయ ఆయుధంగా మారిందా? అని ప్రశ్నించారు. మరో ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో తన ప్రతిస్పందన తెలియజేశారు. తేజస్వి యాదవ్ తన పర్యటనలో ప్రధాని మోదీ దివంగత తల్లిపై దుర్భాషలాడారని అన్నారు. ఈ రకమైన రాజకీయాలు ఆమోదయోగ్యం కాదని, దీని ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. కాగా బీజేపీ ఆరోపణలపై ఆర్జేడీ నుండి అధికారిక స్పందన రాలేదు.  కాగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సెప్టెంబర్ 16న జెహానాబాద్ నుండి తన బీహార్ అధికార్ యాత్రను ప్రారంభించారు. యాత్రలోని మొదటి దశ నలంద, బెగుసరాయ్ తదితర ప్రాంతాల గుండా సాగి, సెప్టెంబర్ 20న వైశాలిలో ముగిసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement