Bihar: పోలీసులతో ఘర్షణ...మెడికోలకు గాయాలు! | Bihar Violent Clash Between Police and Medical Students | Sakshi
Sakshi News home page

Bihar: పోలీసులతో ఘర్షణ...మెడికోలకు గాయాలు!

Jul 22 2024 8:38 AM | Updated on Jul 22 2024 8:53 AM

Bihar Violent Clash Between Police and Medical Students

ముజఫర్‌పూర్: బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లోని శ్రీ కృష్ణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్(ఎస్‌కేఎంసీహెచ్‌)లో వైద్య విద్యార్థులు, పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపధ్యంలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పలువురు జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థులు గాయపడ్డారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతలో పోలీసుల చర్యను నిరసిస్తూ వైద్యులు సమ్మెకు దిగారు.

పోలీసుల లాఠీచార్జి అనంతరం వైద్య విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వారు. లాఠీ ఛార్జీకి నిరసనగా ఎస్‌కేఎంసీహెచ్‌లో వైద్యులు ఎమర్జెన్సీతో సహా అన్ని సేవలను నిలిపివేశారు. సమ్మెకు దిగుతున్నట్లు జూనియర్‌ డాక్టర్లు ప్రకటించారు. ఈ ఘటనకు దారితీసిన వివరాల్లోకి వెళితే ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో ముగ్గురు వైద్య విద్యార్థులు బైక్‌పై మార్కెట్‌ నుంచి తిరిగి వస్తున్నారు. మెడికల్ కాలేజీ గేటు నంబర్ త్రీ దగ్గర అహియాపూర్ పోలీస్ స్టేషన్ పెట్రోలింగ్ అధికారి వీరిని ఆపారు.

ఈ నేపధ్యంలో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు ఒక వైద్య విద్యార్థిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయాన్ని మిగిలిన వైద్య విద్యార్థుల వాట్సాప్ గ్రూప్‌లో విద్యార్థులందరికీ షేర్‌ చేశారు. దీంతో అక్కడకు చేరుకున్న విద్యార్థులంతా పోలీసు పెట్రోలింగ్ బృందాన్ని చుట్టుముట్టారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు నాలుగు వాహనాల్లో ఎస్‌కెఎంసిహెచ్‌కి చేరుకున్నారు. అనంతరం వారు విద్యార్థులపై లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న రోగులు, వారి బంధువులు భయాందోళనలతో ఆస్పత్రి నుంచి బయటకు పరుగులు తీశారు. పోలీసుల లాఠీచార్జిలో గాయపడిన వైద్య విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement