
ఓ పోలీసు సహనం కోల్పోయి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. ప్రజల పట్ల పోలీసులు ఇలా ప్రవర్తిస్తారా? అని ముక్కుమీద వేలేసుకునేలా బెదిరింపులకు దిగాడు. ఈ షాకింగ్ ఘటన బిహార్లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. బిహార్ పోలీసు ఒక టీచర్ పట్ల అత్యంత అనుచితంగా ప్రవర్తించాడు. ఒక ఉపాధ్యాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి వివాదాన్ని పరిష్కరించుకునేందుకు రాజధాని పాట్నాకు 165 కిలోమీటర్ల దూరంలో ఉన్న జమయి పోలీస్టేషన్కు వచ్చారు.
అయితే ఆ టీచర్ పోలీసు పిలిపించిన సమయాని కంటే మూడు రోజులు ఆలస్యంగా వచ్చాడు. దీంతో విసిగిపోయిన సదరు పోలీసు దురుసుగా ప్రవర్తించాడు. పోలీసు రాజేష్ శరణ్ కూర్చొన్న సీటులోంచి లేచి కోపంతో ..ప్రజలను తీవ్రవాదులుగా ప్రకటించడమే మా పని.. ఒక్కసెకనులో నిన్ను ఉగ్రవాదిగా ప్రకటిస్తా! అని బెదరింపులకు దిగాడు. కానీ ఉపాధ్యాయుడు అందుకు గల కారణాన్ని వివరించేందుకు యత్నించినా వినకుండా ఇలా అధికార మదంతో చెలరేగిపోయాడు.
ఆ సమయంలో చుట్టు పక్కల ఉన్న ప్రజలెవరూ జోక్యం చేసుకోలేదు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో జమయి పోలీస్టేషన్ ఈ ఘటనపై సత్వరమే విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
(చదవండి: శరద్ పవార్ రాజీనామా తదనంతరం మరో ఎన్సీపీ నేత రాజీనామా)