కృష్ణరాజపురం: బెంగళూరులోని చిక్కబాణావరలో జరిగిన తండ్రీ, చిన్నారి కొడుకు హత్య కేసులో దారుణమైన విషయాలు బయటపడ్డాయి. భార్య, ఆమె ప్రియుడు కుట్ర చేసి హతమార్చారని తేలింది. సమాజంలో మాయమవుతున్న మానవత్వాన్ని ఇది ప్రతిబింబిస్తోంది. వివరాలు, హులియారుదుర్గ నివాసి అభినందన్ (33), కుమారుడు యదువీర్ (5), భార్య హరిణి కలిసి నివసిస్తున్నారు. అభినందన్కు కోట్లాది రూపాయల విలువ చేసే స్థలాలు ఉన్నాయి.
భార్య హరిణి తరచూ భర్తతో గొడవపడేది. వీరు అదే ఇంట్లో వేర్వేరుగా ఉంటున్నారు. రెండేళ్ల కిందట ఆమెకు సోషల్ మీడియా ద్వారా వినయ్ అనే యువకునితో అక్రమ సంబంధం ఏర్పడింది. దీనిని తెలుసుకున్న భర్త ఆమెను మందలించాడు. పైగా తన హత్యకు పథకం వేస్తున్నారని అతనిలో అనుమానం ఏర్పడి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కానీ మామూలు ఇంటి గొడవ అని పోలీసులు పట్టించుకోలేదు.
ప్లాన్ ఇలా అమలు
భర్తను వదిలించుకుంటే ఆస్తి దక్కడంతో పాటు హ్యాపీగా ఉండవచ్చనుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకూ దంపతులు గొడవపడి వేర్వేరుగా నిద్రపోయారు. హరిణి అంతకుముందే వినయ్ను పిలిపించగా అతడు ఇంటి ఆవరణలో దాక్కున్నాడు. ఇద్దరూ సీసీ కెమెరాలను ఆఫ్ చేసి, అభినందన్ను గొంతు పిసికి చంపారు. బాలుడు యదువీర్ లేవగా అతన్ని అలాగే హత్య చేశారు. సోమవారం ఉదయం ఇద్దరూ నిద్రలోనే చనిపోయారని విలపించింది. పోలీసులు హరిణిని తమదైన శైలిలో విచారించగా గుట్టు విప్పింది. పరారీలో ఉన్న వినయ్ను కూడా పోలీసులు పట్టుకున్నారు.


