సీజ్ చేసిన వాహనం తిరిగి ఇవ్వలేదని మనస్తాపం
బంటుమిల్లి: కృష్ణాజిల్లా బంటుమిల్లి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మంగళవారం కనకరాజు అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. తన బొలెరో వాహనాన్ని పోలీసులు తిరిగి ఇవ్వడం లేదని మనస్తాపానికి గురై ఈ చర్యకు పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన పోలీసులు మంటలను ఆర్పి చికిత్స నిమిత్తం యువకుడిని విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే... ఈ నెల 16న బంటుమిల్లి ఎస్ఐ ఎం.నాగరాజు వాహనాల తనిఖీ చేస్తున్నారు. కృత్తివెన్ను మండలం గరిశపూడి పంచాయతీ శివారు దోమలగొంది గ్రామానికి చెందిన తిరుమలశెట్టి కనకరాజు బొలెరో వాహనంలో వస్తుండగా పోలీసులు ఆపారు. కనకరాజు డ్రస్సు కోడ్ పాటించలేదంటూ ఎస్ఐ కేసు రాశారు.
దీనిపై వాదనకు దిగగా, యువకుడిని స్టేషన్కు తీసుకువచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష అనంతరం కేసు నమోదు చేసి, వాహనాన్ని స్వా«దీనం చేసుకున్నారు. మరుసటి రోజు ఎవరినైనా జామీను తెచ్చుకుని వాహనం తీసుకువెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో స్టేషన్కు వచ్చిన కనకరాజు తన వాహనాన్ని విడుదల చేయాలని కోరాడు. పోలీసులు కుదరదని చెప్పడంతో ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలతో కనకరాజు స్టేషన్లోకి పరిగెత్తాడు. ఎస్ఐ బాధితుడి చొక్కా లాగేసి, మంటలు ఆర్పేశారు. 108 వాహనంలో చికిత్స నిమిత్తం బందరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


