బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు రోజుకో మలుపుతిరుగుతున్నాయి. ఎన్నో అపసోపాలు పడి ఎట్టికేలకు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన డీకే శివకుమార్కు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం తనకు కీలక శాఖ కేటాయించలేదని పార్టీ సీనియర్ నేత రామలింగారెడ్డి రాజీనామా అనంతరం అది సద్దుమణగడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరోనేత డీకే శివకుమార్పై అసమ్మతి గళం వినిపిస్తున్నారు.
కన్నడ మంత్రి కృష్ణ బైరేగౌడకు ఇటీవల జరిగిన క్యాబినేట్ విస్తరణలో బెంగళూరు డెవలఫ్మెంట్ ఫోర్ట్ పోలియో కేటాయించారు. అయితే అందులో కీలకమైన గ్రేటర్ బెంగళూరు అభివృద్ధి బాధ్యతలు సీఎం వద్దే ఉండటం, బీడీఏ, బీఎంఆర్డీఏ వంటి కీలక సంస్థలు కూడా ఆయన పరిధిలో ఉండడంతో ఆయనకు అధికార విభజనపై గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో కృష్ణబైరే గౌడ స్పందించారు. తనకు కేటాయించిన ఫోర్ట్ పోలియోపై స్పష్టతనివ్వాలని సీఎం శివకుమార్ను కోరారు.
కృష్ణబైరే గౌడ మాట్లాడుతూ " నాకు ఎలాంటి అసంతృప్తి లేదు. బెంగళూరు అభివృద్ధిని పర్యవేక్షించే కష్టమైన బాధ్యతను పార్టీ నాకు అప్పగించింది. ఇది చాలా కఠినమైన పని. నేను దీనిని అధికార సమస్యగా చూడటం లేదు. ఇలాంటి బాధ్యత తీసుకునేటప్పుడు స్పష్టత ఉండాలి, ఎందుకంటే నేను ఏ బాధ్యత తీసుకున్నా నా వైపు నుండి జవాబుదారీతనం ఉంటుంది. స్పష్టత ఉన్నప్పుడే మనం ఫలితాలను అందించగలం," అని గౌడ అన్నారు.నాకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దానిపై స్పష్టత ఆశిస్తానని పేర్కొన్నారు. అయితే ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని సీఎం తనకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
కాగా ఈ అంశంమై కృష్ణబైరే గౌడ ఇదివరకే అదిష్ఠానంతో చర్చించడానికి ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. ఇక కర్ణాటకలో గత వారం కేబినెట్ విస్తరణలో మొత్తం 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా.. ఇంకా 21 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలపై తీవ్ర స్థాయిలో లాబీయింగ్ కొనసాగుతోంది. ఒక్కో శాఖ కేటాయింపే ఇప్పుడు రాజకీయ ప్రాధాన్యం పొందుతుండటంతో కాంగ్రెస్లో అంతర్గత సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.


