బాబా సిద్ధిఖీ హత్య.. కేజ్రీవాల్‌ రియాక్షన్ | baba siddique shot diseased: political leaders reactions | Sakshi
Sakshi News home page

బాబా సిద్ధిఖీ హత్య.. కేజ్రీవాల్‌ రియాక్షన్

Oct 13 2024 2:57 PM | Updated on Oct 13 2024 3:28 PM

baba siddique shot diseased: political leaders reactions

ముంబై: బాంద్రా మాజీ ఎమ్మెల్యే, ఎన్సీపీ(అజిత్‌ పవార్‌ వర్గం) నేత బాబా సిద్ధిఖీ హత్య మహారాష్ట్ర, బాలీవుడ్‌లో సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి , ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. బాబా సిద్ధిక్‌ హత్యతో మహారాష్ట్రే కాదు.. దేశం మొత్తం భయాందోళనకు గురవుతోందని ‘ఎక్స్‌’ వేదికగా అన్నారు.

‘‘ముంబైలో ఎన్సీపీ నేతను బహిరంగంగా కాల్పులు జరిపి హత్య చేసిన సంఘటనతో మహారాష్ట్ర మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజలు భయపడుతున్నారు. ఢిల్లీలో కూడా అదే వాతావరణాన్ని సృష్టించారు. దేశం మొత్తం మీద గ్యాంగ్‌స్టర్ పాలన తీసుకురావాలన్నారు. ఇప్పుడు వారికి వ్యతిరేకంగా ప్రజానీకం నిలబడాలి’’ అని అన్నారు.

ఈ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి: రాహుల్‌ గాంధీ 

ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖ్ మరణం చాలా బాధాకరమని, మరణ వార్త వినగానే దిగ్భ్రాంతికి గురయ్యానని లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబంతో అండగా ఉంటామని ‘ఎక్స్‌’లో వేదికగా తెలిపారు.

‘‘ ఈ భయానక సంఘటన మహారాష్ట్రలో శాంతిభద్రతలు పూర్తిగా పతనమైందని బట్టబయలు చేసింది. ఈ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. న్యాయం గెలవాలి’’ అని అన్నారు.

 

ఎన్సీపీ నేత బాబా సిద్ధిక్ హత్యపై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.  “ ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య చాలా బాధాకరం. ఆయన దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఇది మహారాష్ట్రలోని రాజకీయ పార్టీల  చిత్తశుద్ధి లోపాన్ని చూపిస్తోంది. ఈ ఘటనతో ముంబై, మహారాష్ట్రల్లోని సామాన్య ప్రజలకు భద్రత కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనట్లు స్పష్టంగా తెలిస్తోంది. ఈ ఘటన చాలా ఆందోళన కలిగిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమ కుర్చీని కాపాడుకోవడంపైనే అక్కడి నేతలు ఆందోళన చెందుతున్నారు. బాబా సిద్దిఖీ హత్య ఘటన పూర్తిగా వైఫల్యం శాంతిభద్రతల లోపం’ అని అన్నారు.

 

ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో బాంద్రాలో తన కుమారుడి  ఆఫీసులో ఉండగా.. పలువురు దుండగులు ఆయనపై  కాల్పులకు పాల్పడ్డారు. ఆయన్ను వెంటనే లీలావతి హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. 

అయితే.. ఈ కేసులో అరెస్టయిన హర్యానాకు చెందిన కర్నైల్ సింగ్, యూపీకి  చెందిన ధర్మరాజ్ కశ్యప్ అనే ఇద్దరు నిందితులు తాము లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందినవారమని పేర్కొన్నట్లు ఇప్పటికే పోలీసు వర్గాలు వెల్లడించాయి.ఇక.. మూడో నిందితుడైన యూపీకి చెందిన శివకుమార్‌ను ఆదివారం అదుపులోకి తీసుకుమని పోలీసులు  తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

ఇక.. సిద్ధిఖీని హత్య చేయడానికి నిందితులు గత కొన్ని నెలలుగా ప్లాన్‌ వేస్తున్నారని, ఆయన నివాసం, కార్యాలయంపై నిఘా పెట్టారని పోలీసులు పేర్కొన్నారు. ఈ హత్య చేసినందుకు నిందితులకు ఒక్కొక్కరికి బిష్ణోయ్‌ గ్యాంగ్‌ రూ.50 వేలు అడ్వాన్స్‌, మారణాయుధాలు ఇచ్చినట్లుగా తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ బాబా సిద్ధిఖీ స్నేహితుడు. ఈ ఘటన నేపథ్యంలో సల్మాన్‌ ఇంటి వద్ద పోలీసులు సెక్యూరిటీ పెంచారు.

చదవండి: దావూద్‌ బాటలో.. బిష్ణోయ్‌ నేరసామ్రాజ్యం

Advertisement
 
Advertisement
Advertisement