60 రోజుల్లో 50 కోట్ల మందికి వ్యాక్సినేషన్
– అజీమ్ ప్రేమ్జీ
న్యూఢిల్లీ: దేశంలో ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో కోవిడ్–19 వ్యాక్సినేషన్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచవచ్చని విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్జీ అభిప్రాయపడ్డారు. తనకు వచ్చిన ఆలోచనను అమలు పరిస్తే 60 రోజుల్లో 50 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయవచ్చని తెలిపారు. బెంగళూరు చాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ కామర్స్లో జరిగిన చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలకు ఈ విషయం తెలిపారు. ‘ప్రభుత్వం తక్షణమే ప్రైవేట్ రంగానికి భాగస్వామ్యం కల్పిస్తే, మన 50 కోట్ల ప్రజలకు 60 రోజుల్లోనే టీకా అందించగలం’అని చెప్పారు.
ప్రైవేట్ రంగానికి అవకాశం కల్పిస్తే వ్యాక్సినేషన్ రేటు భారీగా పెరుగుతుందన్నారు. రికార్డు సమయంలో కోవిడ్–19 వ్యాక్సిన్ రూపకల్పన జరిగిందనీ, పెద్ద సంఖ్యలో ప్రజలకు టీకా వేయడమే ప్రస్తుత లక్ష్యమని చెప్పారు. ‘సీరం ఇన్స్టిట్యూట్ నుంచి టీకా ఒక్కో డోసును రూ.300 చొప్పున పొందేందుకు అవకాశం ఉంది. దీనికి మరో రూ.100 కలుపుకుని ఆస్పత్రులు, ప్రైవేట్ నర్సింగ్ హోంలలో రూ.400కే ప్రజలకు టీకా డోసు ఇవ్వగలుగుతాం. దీంతో దేశంలో భారీగా వ్యాక్సినేషన్ సాధ్యమవుతుంది’అని ప్రేమ్జీ అన్నారు.
సంబంధిత వార్తలు