సాక్షి,చెన్నై: తమిళనాడు ఘోరం జరిగింది. తిరువళ్లూరు రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లో అమ్మోనియం గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో ఏడుగురు మహిళలు మృతి చెందారు. 40 మంది అస్వస్థతకు గురయ్యారు. అమ్మోనియం గ్యాస్ లీక్పై సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటన స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతుండగా.. బాధితుల్లో ఎక్కువ మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.
తిరువళ్లూరు జిల్లా పెరియపాలయం సమీపంలోని కన్నిగైపైర్లో సెయింట్ పీటర్స్ అండ్ పాల్ సీఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ ఫెసిలిటీలో ఈ ఘటన జరిగింది. గ్యాస్ లీక్ అవ్వడంతో రొయ్యల ప్రాసెసింగ్ బాధితులు ఆయాసం, కళ్లు తిరగడం, వాంతులు చేసుకున్నారు.గ్యాస్ లీకేజీ ఘటనపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు బాధితుల్ని రక్షించే ప్రయత్నం చేశారు. పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు..ప్రాసెసింగ్ యూనిట్లో అమర్చిన మెజర్ వాల్వ్ నుంచి ఈ గ్యాస్ లీక్ జరిగినట్లు సమాచారం.
సీఎం విజయ్ విచారం
ఘటనపై సీఎం విజయ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయడంతో పాటు, మంత్రులు ఘటన స్థలాన్ని సందర్శించాలని సూచించారు. ప్రమాదంపై త్రిసభ్యకమిటీని ఏర్పాటు చేశారు.
మరోవైపు ఈ దుర్ఘటనపై తమిళనాడు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ తీవ్రంగా విచారం వ్యక్తం చేశారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ‘తిరువళ్లూరు జిల్లా, పెరియపాలయం సమీపంలోని కన్నిగైపేర్ గ్రామంలోని రొయ్యల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో జరిగిన ఘోరమైన అమ్మోనియా గ్యాస్ లీక్ ఘటనలో అమూల్యమైన ప్రాణాలు కోల్పోవడం, పలువురు కార్మికులు గాయపడటం పట్ల నేను తీవ్రంగా విచారిస్తున్నాను’అని గవర్నర్ కార్యాలయంలో లోక్ భవన అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఈ దురదృష్టకర విషాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన బాధిత కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం. ఈ కష్ట సమయంలో వారికి మనోధైర్యం, ధైర్యం కలగాలని నేను ప్రార్థిస్తున్నాను. చికిత్స పొందుతున్న వారందరూ త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యంతో తిరిగి రావాలని గవర్నర్ ఆకాంక్షిస్తున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొంది.


