
న్యాయవాదికి ఆరు నెలల జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా
అలహాబాద్ హైకోర్టు తీర్పు
అలహాబాద్: కోర్టు ధిక్కరణకు పాల్పడినందుకు ఓ న్యాయవాదికి అలహాబాద్ హైకోర్టు ఆరు నెలల జైలుశిక్ష, రూ.2,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించకపోతే అదనంగా నెల రోజులపాటు జైలుశిక్ష అనుభవించాలని స్పష్టంచేసింది. జస్టిస్ వివేక్ చౌదరి, జస్టిస్ బి.ఆర్.సింగ్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు తాజాగా తీర్పు వెలువరించింది.
లక్నోలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని అశోక్ పాండేను ఆదేశించింది. శిక్షకు గురైన లాయర్ అశోక్ పాండే చేసిన నేరం ఏమిటంటే కోర్టులో విధులకు హాజరైనప్పుడు నల్లకోటు ధరించలేదు. చొక్కాకు గుండీలు సరిగ్గా పెట్టుకోలేదు. 2021 ఆగస్టులో ఓ కేసులో వాదించేందుకు అశోక్ పాండే హైకోర్టుకు హాజరయ్యారు.
నిబంధనల ప్రకారం నల్లకోటు ధరించకుండా, చొక్కాలు గుండీలు సరిగ్గా లేకుండా వచ్చిన పాండేను న్యాయమూర్తి మందలించారు. ఇలా చేయడం కోర్టు ధిక్కరణే అవుతుందని చెప్పారు. వెంటనే బయటకు వెళ్లిపోవాలని ఆదేశిచారు. దాంతో ఆగ్రహానికి గురైన అశోక్ పాండే న్యాయమూర్తులంతా గూండాలు అంటూ విమర్శించారు. ఈ అంశాన్ని హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. బాధ్యత కలిగిన వృత్తిలో ఉన్న అశోక్ పాండే ప్రవర్తన సక్రమంగా లేదని, అతడికి జైలుశిక్ష, జరిమానా విధించడం సబబేనని ధర్మాసనం తేల్చిచెప్పింది.