
మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఘోర రైలు ప్రమాదం
రెండు రైళ్ల నుంచి కిందపడిన 13 మంది ప్రయాణికులు
నలుగురి మృతి... 9 మందికి గాయాలు
ముంబై: మహారాష్ట్రలోని థానే జిల్లాలో సోమవారం జరిగిన ప్రమాదంలో జీఆర్పీ కానిస్టేబుల్ సహా నలుగురు రైలు ప్రయాణికులు మరణించారు. మరో 9 మంది గాయపడ్డారు. ఉదయంపూట కిక్కిరిసిన రైళ్లలో నిర్లక్ష్యంగా ప్రయాణించడమే ఇందుకు కారణం. ముంబ్రా రైల్వే స్టేషన్సమీపంలో ఈ ఘటన జరిగింది. రెండు రైళ్లలో జనం కిక్కిరిసిపోయి ఉన్నారు. వీపులకు భారీ బ్యాగులు తగిలించుకొని డోర్ల వద్ద ఫుట్బోర్డులపై వేలాడుతూ ప్రయాణిస్తున్నారు.
వీటిలో ఒక రైలు కాసారా వైపు, మరొకటి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వైపు వెళ్తోంది. ఈ రెండు రైళ్లు పక్కపక్కనున్న పట్టాలపై పరస్పరం వ్యతిరేక దిశలో వచ్చిన సమయంలో మూలమలుపు వద్ద ప్రయాణికుల బ్యాగులు పరస్పరం ఢీకొన్నాయి. దాంతో మొత్తం 13 మంది వెంటనే కిందపడిపోయారు. వీరిలో నలుగురు తీవ్రంగా గాయపడి మృతి చెందారని రైల్వే అధికారులు ప్రకటించారు. బాధితులను కేతన్ సరోజ్, రాహుల్ గుప్తా, మయూర్ షా, జీఆర్పీ కానిస్టేబుల్ విక్కీ ముఖ్యాద్గా గుర్తించారు.
రైళ్లకు అటోమేటిక్ డోర్లు లేకపోవడం ప్రాణాంతకంగా మారిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో రైళ్లకు ఆటోమేటిక్ డోర్లు ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ నిర్ణయించినట్లు అధికారి దిలీప్ కుమార్ చెప్పారు. ప్రయాణికులు లోపలికి వెళ్లగానే డోర్లు వాటంతట ఆవే మూసుకుపోయేలా రైలు బోగీలను డిజైన్ చేయనున్నట్లు వెల్లడించారు. ముబ్రా రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేయాలని రైల్వే శాఖను కోరనట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. బాధిత కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది.

Maharashtra | Some passengers travelling towards CSMT fell from the train at Thane's Mumbra railway station. The reason for the accident is believed to be excessive crowd in the train. The railway administration and police have reached the spot. The injured are being taken… pic.twitter.com/UMBq41jcvm
— ANI (@ANI) June 9, 2025