నంద్యాల(అర్బన్): జిల్లాలో పదో తరగతిలో 183 మందికి, ఇంటర్మీడియట్లో 44 మందికి.. మొత్తం 227 మందికి షైనింగ్ స్టార్స్ అవార్డులు సోమవారం అందజేశారు. మెరిట్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి రూ.20వేల నగదు ప్రోత్సాహకం, ప్రశంసా పత్రం, గోల్డ్ మెడల్లను అందజేసి ఘనంగా సత్కరించారు. నంద్యాల మండలం చాబోలు రోడ్డులోని ఏఎస్ఆర్ ఫంక్షన్ హాలులో ఈ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి శంకర్ నాయక్, జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. మంత్రి, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ మాట్లాడుతూ... విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని పట్టుదలతో ముందుకు సాగాలన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై అనవసర ఒత్తిడి తీసుకురాకుండా వారి అభిరుచులు, సామర్థ్యాలకు అనుగుణంగా ఉన్న త విద్యను ఎంచుకునేలా ప్రోత్సహించాలన్నారు. పరీక్షలకు ముందు తాను ఇచ్చిన హామీ మేరకు అత్యధిక మార్కులు సాధించిన ఓ విద్యార్థినికి మూడు గ్రాముల బంగారు కమ్మలు మంత్రి ఫరూక్ అందజేశారు. ప్రతిభావంతులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, డిప్యూటీ డీఈఓలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


