నంద్యాల: ప్రజా పరిష్కార వేదిక ద్వారా స్వీకరించే ప్రతి అర్జీని నిర్లక్ష్యం లేకుండా నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను సత్వరమే నాణ్యతతో బియాండ్ ఎస్ఎల్ఎ వెళ్లకుండా ఎప్పటి కప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తం 5,367 అర్జీలు రీఓపెన్ అయ్యాయని, వాటిలో 5,328 పరిష్కారం కాగా ఇంకా 39 పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలన్నారు. రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 198 అర్జీలు స్వీకరించామన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ రామునాయక్, నోడల్ ఆఫీసర్ ఉమామహేశ్వరి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


