శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల చిత్రపటాలు కనిపిస్తేనే రెండు చేతులతో నమస్కరిస్తాం. శ్రీశైల దేవస్థాన అధికారిక లోగోకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తాం. కానీ దేవస్థాన అధికారులు మాత్రం లోగోను మొక్కల కుండీలకు చిత్రీకరించి అపవిత్రం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల శ్రీశైల దేవస్థాన పరిపాలనా భవనంలోని అన్ని విభాగాల చాంబర్ల ముందు సుందరీకరణ కోసం మొక్కలను ఏర్పాటు చేశారు. ఈ మొక్కలను ప్లాస్టిక్ పూల కుండీల్లో పెట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. పూలకుండీలకు దేవస్థానం గోపురం, త్రిశూలం, మూడు అడ్డ నామాలతో కూడిన లోగోను చిత్రీకరించారు. దేవస్థాన ఉన్నతాధికారి సూచన మేరకు ఈ లోగో అతికించినట్టు సమాచారం. ఆయా పనుల కోసం చాంబర్ల వద్దకు వచ్చిన పలువురు చెప్పులను ఆ కుండీల వద్దే వదిలి వెళ్తున్నారు. ఆదివారం శ్రీశైల దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ చాంబర్ ముందు చెప్పులు విడిచి వెళ్లారు. గమనించిన పలువురు భక్తులు దేవస్థానం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే దేవస్థాన లోగోను తొలగించి పవిత్రతను కాపాడాలని కోరుతున్నారు.
– శ్రీశైలంటెంపుల్


