దర్జాగా ఎర్రమట్టి అక్రమ తవ్వకాలు టీడీపీ నేతలకు టిప్పర్కు
బనగానపల్లె: కూటమి నేతలు ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నారు. ఇసుక, మట్టి, మొరుసు కనిపించినా వదలడం లేదు. బనగానపల్లె కేంద్రంగా ఎర్రమట్ట దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. మండలంలోని రామతీర్థం సమీపంలోని జంగమయ్య మొలమీది ప్రాంతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎర్రమట్టి అక్రమ రవాణా కొనసాగుతున్నా అడ్డుకునేవారు కరువయ్యారు. రాత్రి పగలు తేడా లేకుండా కొండలను కరిగించేస్తున్నారు. పెద్ద పెద్ద యంత్రాలతో తవ్వి టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రోజుకు 40 నుంచి 50 టిప్పర్ల వరకు ఎర్రమట్టిని నంద్యాల, మద్దూరు ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. స్థానిక అధికార పార్టీ నాయకులకు టిప్పర్కు రూ.600 నుంచి రూ. 700 చెల్లిస్తుండగా.. ప్రొక్లెయిన ర్ యజమానికి టిప్పర్కు రూ.300 నుంచి 400 చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ అధికారుల నుంచి ఎన్ఓసీ లేక పోయినప్పటికీ, మైనింగ్ అధికారులకు రాయల్టీ చెల్లించకున్నా దర్జాగా దందా సాగిస్తున్నారు. అధికారులు సైతం మామూళ్లతో దాడులు చేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత వైఎస్సార్సీపీ హయాంలో ఎటువంటి అక్రమ రవాణా జరగలేదని ఈ ప్రాంత ప్రజలు పేర్కొంటున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఎర్రమట్టి దందాను అరికట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
రూ. 500 మేర కమీషన్


