ప్రాజెక్టుల పూర్తికి చర్యలు
తీసుకుంటున్నాం
నల్లగొండ : విద్యార్థుల చదువులు, ప్రవర్తనపై వార్డెన్లు, ఉపాధ్యాయులు దృష్టిసారించాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులకు చెప్పారు. ఆయన మంగళవారం జిల్లా ఎస్సీ, బీసీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు, ఆర్సీఓలు, ఇంజనీర్లతో కలెక్టరేట్లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. విద్యార్థుల మానసిక పరిస్థితిని గమనిస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులు కనిపించినా వెంటనే గుర్తించి తగిన విధంగా కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించారు. ససంక్షేమ శాఖల పరిధిలోని హాస్టళ్లు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, మిషన్ భగీరథ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లలో మిగిలి ఉన్న పనులను టెండర్లు పిలిచి తక్కువ సమయంలోనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. హాస్టళ్లలో విద్యార్థులకు కూడా నీటి సంరక్షణపై అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యుటీ డైరెక్టర్ శశికళ, బీసీ సంక్షేమ అధికారి సంజీవ, మైనార్టీ కార్పొరేషన్ అధికారి విజయేందర్రెడ్డి , పంచాయతీరాజ్ అధికారి గిరిధర్, మిషన్ భగీరథ డీఈ శాంతకుమారి పాల్గొన్నారు.
సాగునీటి ప్రాజక్టుల భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి నిర్దేశించిన సమయంలో ప్రాజెక్టుల పూర్తికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. ఆయన మంగళవారం కలెక్టరేట్లో హైదరాబాద్ నుంచి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్పరెన్స్లో పాల్గొని మాట్లాడారు. పెండ్లిపాకల, చింతపల్లి, నెల్లికల్ కిష్టరాంపల్లి, దున్నపోతులగండి, ఉదయసముద్రం తదితర ఎత్తిపోతల పథకాలకు సంబంధించి భూ సేకరణ చెల్లింపులకు ప్రభుత్వం నుంచి 371.82 కోట్ల రూపాయలు వచ్చాయని, ఇందులో భూములు కోల్పోయిన రైతులకు రూ.181.43 కోట్లు చెల్లించామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా ప్రాజక్టుల చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
ఫ సంక్షేమ శాఖల అధికారులు, ఆర్సీఓలకు కలెక్టర్ సూచన


