నల్లగొండ : కలెక్టరేట్ పరిధిలోని అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులకు సెప్టెంబర్ 1 నుంచి ఫేస్ రికగ్నిషన్ ఆధారిత హాజరు విధానాన్ని అమలు చేయనున్నట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం అయినా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం అధికారుల సమావేశంలో మాట్లాడారు. అధికారి నుంచి వాచ్మన్ వరకు ప్రతి ఉద్యోగి ఈ యాప్లో నమోదు కావాలని, ఇకపై యాప్లో నమోదయ్యే హాజరు ఆధారంగానే ఉద్యోగుల జీతాలు, ఇతర బిల్లులు పాస్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. వనమహోత్సవంలో భాగంగా మంగళవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాల్లో సామూహికంగా మొక్కలు నాటాలని కలెక్టర్ ఆదేశించారు. అటవీ, గ్రామీణాభివృద్ధి, స్థానిక సంస్థల అధి కారులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ ఏడాది 57.70 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల ప్రతిపాదనలు పంపాలి..
ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో గుడిసెల స్థానంలో ఇళ్లను గుర్తించిన అర్హులైన లబ్ధిదారుల వివరాలను వారంలోగా సిద్ధం చేసి మంజూరుకు ప్రతిపాదనలు పంపాలని స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్కరణ్రెడ్డిని ఆదేశించారు. అన్ని శాఖలు ఇకపై టీ–ఫైబర్ నెట్వర్క్ను వినియోగించాలని సూచించారు. జిల్లా అధికారులు ప్రతి నెల 5వ తేదీలోగా టూర్ డైరీలు సమర్పించాలని, పత్రికల్లో వచ్చే వ్యతిరేక వార్తలపై ఎప్పటికప్పుడు స్పందించి వివరణ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రజావాణి దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి..
వివిధ స్థాయిల్లో వచ్చిన ప్రజావాణి దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం సీఎం ప్రజావాణికి సంబంధించిన 28, మండల స్థాయిలో 190 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో రెవెన్యూ శాఖకు 58, ఇతర శాఖలకు 58.. మొత్తం 116 ఫిర్యాదులు వచ్చాయని విరించారు. సమావేవంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డిప్యూటీ కలెక్టర్ (ట్రెయినీ) శ్రీకాంత్రెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డి, డీఆర్ఓ దశరథ్ ఉన్నారు.
27న గ్రామ, వార్డు సభలు
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా ఈ నెల 27న అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27న జరిగే గ్రామ, వార్డు సభలకు బీఎల్వోలు హాజరు కావాలన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తూ అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా, అనర్హులు లేదా తప్పుగా నమోదైన పేర్లను నిబంధనల ప్రకారం పరిశీలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్ఓ దశరథ, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 1 నుంచి అమలు
ఫ హాజరు ఆధారంగానే జీతాలు, బిల్లుల మంజూరు
ఫ ప్రజావాణి ఫిర్యాదులు పరిష్కరించాలి
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


