దేవరకొండ : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా శ్రమించిన బహుజన వీరుడు పండుగ సాయన్న 166వ జయంతిని జాతీయ బీసీ సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి శ్రీనివాస్ గౌడ్.. పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పండుగ సాయన్న ఆశయాలను ఆదర్శంగా తీసుకొని బహుజనులంతా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోటేశ్వర రావు, భాస్కరాచారి, వెంకటేష్, భిక్షమయ్య, నాగయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై పోరాడాలి
మర్రిగూడ : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజలను చైతన్యపరుస్తూ పోరాటాలను మరింత బలోపేతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. శనివారం మర్రిగూడ మండలంలోని శివన్నగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన జీపుజాత, బైక్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి వాటి పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, కార్మికులు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ వారి హక్కుల కోసం ఐక్యంగా పోరాడేలా చైతన్యం తీసుకురావాలన్నారు. ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లడంతోపాటు వాటి పరిష్కారం జరిగే వరకు ఉద్యమాలు కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఈదుల భిక్షంరెడ్డి, బుర్ర శేఖర్, బుడిజపాక జగన్, చెల్లం పాండురంగారావు, ఆకుల రఘుమయ్య, ఎరుకల నిరంజన్, జక్కలి అంజయ్య, కొట్టాల సర్పంచ్ కల్లెట్ల లింగయ్య, అయితగోని వెంకటయ్య, సత్యం, కొట్టం యాదయ్య పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో విశేష పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. శనివారం వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారికి సుప్రభాతం, అభిషేకం, బాలభోగం, ఆరాధన, సహస్ర నామార్చన పూజలు జరిపించారు. ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలు చేపట్టారు. ప్రథమ ప్రాకార మండపంలో ముందుగా శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, శ్రీస్వామి అమ్మవార్ల నిత్యకల్యాణం నిర్వహించారు. సాయంత్రం జోడు సేవలను తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. భక్తులు పూజల్లో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.


