హాలియా : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాకతోనే రాష్ట్రానికి అరిష్టం పట్టుకుందని, అందుకే రాష్ట్రంలో అనావృష్టి పరిస్థితి నెలకొందని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. వ్యవసాయానికి 18 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం హాలియా పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రాస్తారోకోలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో సీఎం రేవంత్రెడ్డి ప్రజలకు అలువిగాని హామీలను ఇచ్చి దేవుళ్లపై ఒట్టేసి ప్రజలను మోసగించాడని.. అందుకే రాష్ట్రంలో అనావృష్టి నెలకొందన్నారు. సీఎం రేవంత్రెడ్డి కాశీకి వెళ్లి గంగా నదిలో పుణ్యస్నానం చేసి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే నాగార్జునసాగర్ వచ్చి వరుణయాగంలో పాల్గొనాలన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అందిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం 12 గంటలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. ప్రధాన సెంటర్లో గంటకు పైగా రాస్తారోకో చేయడంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. రాస్తారోకో విషయం తెలుసుకున్న హాలియా ఎస్ఐ సాయి ప్రశాంత్ అక్కడికి చేరుకుని భగత్తో మాట్లాడారు. విద్యుత్ సక్రమంగా అందేలా ఆ శాఖ అధికారులతో మాట్లాడతామని చెప్పడంతో రాస్తారోకో విరమించారు. కార్యక్రమంలో రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఫ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్
ఫ విద్యుత్ సక్రమంగా ఇవ్వాలని హాలియాలో రాస్తారోకో


