Telangana Crime News: తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె!
Sakshi News home page

తండ్రికి తలకొరివి పెట్టిన కుమార్తె!

Dec 14 2023 2:16 AM | Updated on Dec 14 2023 11:30 AM

- - Sakshi

తండ్రి దహన సంస్కరాలు చేస్తున్న మౌనిక

చిలుకూరు: చిలుకూరు గ్రామానికి చెందిన కొడారు శ్రీనివాస్‌రావు(41) బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు. అతడికి కుమారులు లేరు. కుమార్తె మౌనిక మాత్రమే సంతానం. కొడుకులు లేకపోవడంతో మౌనిక తన తండ్రి చితికి నిప్పు పెట్టింది. ఈ ఘటనను చూసి పలువురు గ్రామస్తులు కంటతడి పెట్టారు.

పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం
వలిగొండ: మండలంలోని ఎదుల్లగూడెం గ్రామానికి చెందిన మునుకుంట్ల బాలమణి కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై బుధవారం తన ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు గమనించి 108 వాహనంలో భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెకు భర్త, కుమారుడు, కూమార్తె ఉన్నారు.

వ్యవసాయ బావుల వద్ద ట్రాక్టర్ల అపహరణ
ఆత్మకూరు(ఎం):
వ్యవసాయ బావుల వద్ద ఉంచిన ట్రాక్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. వివరాలు ఆత్మకూరు(ఎం) మండలంలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన తుమ్మల మహేందర్‌రెడ్డి ట్రాక్టర్‌ ఇంజన్‌తో పాటు లింగరాజుపల్లి గ్రామానికి చెందిన దేశబోయిన శ్రీశైలం ట్రాక్టర్‌ ట్రాలీని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోయారు. దీంతో బాధితులు బుధవారం ఆత్మకూరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఇసుక డంపు సీజ్‌
నూతనకల్‌:
మండల పరిధిలోని గుండ్లసింగారం ఆవాసంలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపును పోలీసులు, రెవెన్యూ సిబ్బంది బుధవారం సీజ్‌ చేశారు. తహసీల్దార్‌ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. గుండ్లసింగారం గ్రామ శివారులోని పాలేరు వాగు నుంచి అక్రమంగా ఇసుకను తోడి మామిడి తోటలో నిల్వ చేశారని వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించామని సుమారు 80ట్రిప్పుల ఇసుకను నిల్వ చేసినట్లు నిర్ధారించి సీజ్‌ చేసినట్లు తెలిపారు. సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు.

చికిత్స పొందుతూవృద్ధుడి మృతి
రామగిరి(నల్లగొండ): రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పర్తి మండలం కేశరాజుపల్లికి చెందిన అల్లం ముత్తయ్య(75) ఈనెల 2న తన మేనకోడలు ఊరైన పేరందేవిగూడేనికి ఆటోలో వెళ్తూ చిన్న సూరారం వద్ద దిగాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా నల్లగొండ నుంచి నకిరేకల్‌ వైపు వెళ్తున్న బొలేరో వాహనం అతడిని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ముత్తయ్య తలకు, రెండు కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. మృతుడి రెండో కుమారుడు అల్లం రామ్మూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ సింగం రామ్మూర్తి తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement