కొల్లాపూర్ నుంచి కృష్ణానది వరకు సా..గుతున్న ఎన్హెచ్–167కే పనులు
● రెవెన్యూ శాఖ పరిధిలోని భూ సేకరణలోనే తీవ్రజాప్యం
● ఏడాది క్రితమే రైతులకు నోటీసుల అందజేత
● పరిహారం చెల్లించకపోవడంతో పూర్తికాని ప్రక్రియ
● మరోవైపు అటవీ భూములకు అనుమతి క్లియర్
కొల్లాపూర్: జిల్లాలోని కల్వకుర్తి నుంచి ఏపీలోని నంద్యాల వరకు.. తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నిర్మిస్తున్న జాతీయ రహదారి–167కే పనులు ముందుకు సాగడం లేదు. అధికారుల నిర్లక్ష్యం, భూ సేకరణలో ఆలస్యం వంటి కారణాలతో పనులు నత్తకు నడక నేర్పిస్తున్నాయి. ఐదు ప్యాకేజీలుగా విభజించి నిర్మిస్తున్న ఈ రహదారిలో 1, 4, 5 ప్యాకేజీల పనులు ముమ్మరంగా జరుగుతుండగా.. 2, 3 ప్యాకేజీల పనులకు సంబంధించి ఇప్పటి వరకు టెండర్లే నిర్వహించలేదు. రెండేళ్ల వ్యవధిలో ఈ రహదారి నిర్మాణం పూర్తవుతుందని జాతీయ రహదారుల సంస్థ ప్రకటించింది. పనులను అధికారికంగా ప్రారంభించి మూడేళ్లు గడుస్తున్నా ఇంకా పూర్తికావడం లేదు.


