కల్వకుర్తి రూరల్: ఉద్యాన పంటల సాగుతో అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి వెంకటేశం అన్నారు. మంగళవారం కల్వకుర్తి మండలం ముకురాల, లింగసానిపల్లి గ్రామాలతో పాటు ఊర్కొండ మండలంలో సాగుచేసిన ఉద్యాన పంటలను ఆయన పరిశీలించి.. రైతులకు పలు సూచనలు చేశారు. ఈసారి ఎల్నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులు తక్కువ నీటితో పండించే కూరగాయలు, ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. కరువు పరిస్థితులను తట్టుకునే జామ, ఉసిరి, దానిమ్మ, మామిడి తోటలతో రైతులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. తోటలకు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీరందించాలని.. సేంద్రియ, ప్లాస్టిక్ మల్చింగ్ ద్వారా నేలల్లో తేమ సంరక్షణ చేసుకోవాలని రైతులకు సూచించారు. ఆయన వెంట ఉద్యానశాఖ అధికారి మహేశ్వరి, విస్తరణాధికారి శివలీల ఉన్నారు.


