అచ్చంపేట రూరల్: వీబీ–జీ రామ్జీ పథకంతో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వీబీ–జీ రామ్జీపై అచ్చంపేట, ఉప్పునుంతల మండలాల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పథకం అమలులో పారదర్శకత, నాణ్యత, సమయపాలనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామీణ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు గ్రామాభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. సమావేశంలో ఆయా మండలాల ఎంపీడీఓలు, ఏపీఓలు, ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లు ఉన్నారు.


