కందనూలు: ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను గడువులోగా పూర్తిచేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. సోమవారం బిజినేపల్లి మండలం వట్టెం గ్రామంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ డిజిటలైజేషన్ ప్రక్రియను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిజిటలైజేషన్ ప్రక్రియ పురోగతిని పరిశీలించిన ఆయన, అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులతో మాట్లాడి చేపడుతున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియను ఎలాంటి లోపాలకు తావులేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఓటరుకు ఈ ప్రక్రియపై సమగ్ర అవగాహన కల్పించాలని, ఆగస్టు 3లోగా ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించని వారి వివరాలు ఓటర్ల జాబితాలో నమోదు కాకపోవచ్చనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా నమోదు ప్రక్రియకు దూరం కాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు అవసరమైన సమాచారం అందిస్తూ.. అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు డిజిటలైజేషన్ ప్రక్రియలో తప్పనిసరిగా నమోదయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే అనర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో కొనసాగకుండా చూడడంతోపాటు, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటరు నమోదు (డూప్లికేట్ నమోదు) జరగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు. ఓటర్ల జాబితా పారదర్శకంగా, ఖచ్చితత్వంతో రూపొందేలా ఎన్నికల సంఘం నిబంధనలను అమలు చేయాలని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ అర్చన, తహసీల్దార్ మునీరుద్దీన్ పాల్గొన్నారు.


