మక్తల్, అలంపూర్ ముఖ్యనేతల కనుసన్నల్లోనే..
ఆంధ్రప్రదేశ్లోని తాడిపత్రికి చెందిన ఓ అధికారిక రీచ్తో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కృష్ణా పరివాహకంలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అక్కడి కూటమి నేతల సహకారంతో ఆయా ప్రాంతాల నుంచి అక్రమార్కులు ఇసుక వాహనాలను కర్నూలు మీదుగా జాతీయ రహదారి మార్గంలో గద్వాల జిల్లా పుల్లూరు టోల్ప్లాజా గుండా సరిహద్దు దాటిస్తున్నారు. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలోని షాద్నగర్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు చేరవేస్తున్నారు. రాత్రివేళల్లో నిత్యం 50 నుంచి 60 వరకు బెంజ్ వాహనాల్లో ఇసుక రవాణా కొనసాగుతుండగా.. ఇందులో అధికంగా 16 టైర్ల లారీల్లోనే తరలిస్తున్నారు.
ఏపీలో ఉచిత ఇసుక నేపథ్యంలో అక్కడ ఒక లారీ లేదా బెంజ్ లోడ్కు రూ.10 వేల నుంచి రూ.12 వేలు మాత్రమే తీసుకుంటున్నారు. చౌకగా లభిస్తుండడంతో ఇసుక మాఫియా హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలించి దూరాన్ని బట్టి టన్నుకు రూ.1,800 నుంచి రూ.2,200 వరకు విక్రయిస్తున్నారు. మొత్తంగా 16 టైర్ల బెంజ్ ఇసుక (47 టన్నులు.. అయితే పరిమితి మించి అదనంగా 25 నుంచి 30 టన్నుల వరకు వేస్తారు)ను కనిష్టంగా రూ.84 వేలు, గరిష్టంగా రూ.లక్ష వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిసింది.
రాష్ట్ర సరిహద్దు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణా మండలం టైరోడ్డు సమీపంలోని ఓ ఆశ్రమం వద్ద కృష్ణానది పరివాహకంలో గతేడాది ఇసుక మాఫియా ఆధ్వర్యంలో నదిలో సుమారు ఆరు కి.మీ.ల మేర మట్టి రోడ్డు వేశారు. ప్రస్తుతం దీన్ని వదిలేసిన ఇసుకాసురులు వాసునగర్ వద్ద రెండు, ముడుమాల్ వద్ద ఒకటి మొత్తంగా మూడు చోట్ల నదికి అడ్డంగా మట్టి రోడ్లు వేసి దందా కొనసాగిస్తున్నారు. వరద వచ్చినప్పడు నీరు సజావుగా వెళ్లేలా సిమెంట్ పైపులతో తూములు ఏర్పాటు చేశారు. నది ప్రవహిస్తున్న క్రమంలో తప్పితే మిగతా రోజుల్లో ఆయా ప్రాంతాల్లో జేసీబీ, హిటాచీలతో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. పగలు నది నుంచి ఇసుకను తోడి సమీప పొలాల్లో డంప్ చేయడం.. రాత్రి 8 గంటల తర్వాత ఆయా ప్రాంతాల నుంచి కర్ణాటకకు చెందిన 12 చక్రాల బెంజ్ వాహనాల్లో యాద్గిరి, సైదాపూర్, గుల్బర్గా వంటి ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో బెంజ్ ఇసుకను దూరాన్ని బట్టి రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం.
అక్రమ ఇసుక దందాతో వేసిన పంటకు నీరందించే పైపులైన్లు దెబ్బతింటున్నాయని రైతులు ప్రశ్నించగా.. వారిపై మాఫియా దాడులకు పూనుకుంటోంది. మూడుమాల్కు చెందిన ఓ రైతుపై 8 నెలల క్రితం దాడులకు తెగబడింది. దీంతోపాటు ప్రశ్నించిన పలువురిని బెదిరింపులకు గురిచేసినట్లు సమాచారం. దీనిపై కృష్ణా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని బాధితులు చెబుతున్నారు. అడ్డొస్తే చంపేస్తామని దందా నిర్వాహకులు బెదిరించడంతో ఓ పార్టీకి చెందిన వ్యక్తి ఈ విషయాన్ని నారాయణపేట జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. స్పందన కరువైందని తెలుస్తోంది.
ఏపీ నుంచి తెలంగాణకు ఇసుక రవాణాలో ఆటంకాలు కలగకుండా మాఫియా జాగ్రత్తలు తీసుకుంటోంది. అర్ధరాత్రి పోలీసుల గస్తీ, వాహనాల రద్దీ నామమాత్రమే కావడంతో 12.30 నుంచి తెల్లవారుజాము 3 గంటల మధ్య ఇసుక లోడ్ వాహనాలను పుల్లూరు టోల్ప్లాజా దాటిస్తోంది. వాహనాలు బయలుదేరే పది నిమిషాల ముందు ఓ ఎస్కార్ట్ కారు వెళ్లి ఆయా ప్రాంతాల్లో పోలీసుల పహారాపై ముందస్తు సమాచారమిచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఎన్హెచ్ వెంట పోలీస్స్టేషన్లు ఉన్నా.. ఇసుకాసురులు తమ పని కానిచ్చేస్తున్నారు.
మక్తల్ నియోజకవర్గ ముఖ్యనేత కనుసన్నల్లో కర్ణాటక బార్డర్లో కృష్ణానదిలో నిబంధనలకు విరుద్ధంగా రోడ్లు వేసి పలువురు ఇసుకదందా నిర్వహిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. కృష్ణా మండలంలో గతంలో ఇసుక అక్రమాల్లో చక్రం తిప్పి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరిన ఓ వ్యక్తి, ఓ బంధువు, మరికొందరు అనుచరుల ద్వారా ఇసుక లావాదేవీలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా ఏపీ నుంచి తెలంగాణకు ఇసుక రవాణా అటు కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కర్నూలుకు చెందిన ఓ నేత, తెలంగాణలోని అలంపూర్కు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే అయిన ముఖ్యనేత కనుసన్నల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది.


