20 ఎకరాల్లో 45 రోజుల కిందట పత్తి విత్తనాలు విత్తాను. 150 పత్తి పాకెట్ల కోసం రూ.1.50 లక్షలు, దుక్కి దున్నడానికి ట్రాక్టరుకు రూ.లక్ష, కోళ్ల ఎరువుకు రూ.90 వేలు, ఎరువులకు రూ.65 వేలు, కూలీలకు రూ.50 వేలు మొత్తం కలిపి రూ.4.60 లక్షలు ఖర్చుపెట్టాను. ఇప్పుడేమో వర్షాలు లేక పత్తి మొలకలు వాడుపడుతున్నాయి. వర్షాలు కురిస్తేనే పంట చేతికి వస్తుంది. లేకపోతే తీవ్రంగా నష్టపోతా.
– సల్వాది కురుమూర్తి, రైతు, నడిగడ్డ
నాలుగు ఎకరాల్లో పత్తిపంట వేశాను. మొలకెత్తినా వర్షాలు లేక ఎదుగుదల లేకపోగా వాడుపడుతున్నాయి. స్ప్రింక్లర్లతో నీటి తడులు అందిస్తున్నా అంతగా పంట లేదు. వర్షాలు కురిస్తేనే దిగుబడి వస్తుంది. లేకపోతే చాలా నష్టపోతాం. పంట వల్ల లాభం వచ్చి అప్పు తీర్చుతాయని ఆశపడుతాం. పంట పండకపోతే అప్పు పెరిగి మరో ఏడాదిపాటు రైతు కోలుకోలేడు.
– శ్రీనివాసులు, రైతు, తిమ్మాయిపల్లి
ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. గ్రామ పంచాయతీల వద్ద కరపత్రాలు సైతం అతికిస్తున్నాం. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం లేనందున నీరు తక్కువ తీసుకునే పంటలు సాగు చేసుకోవాలి. మినుములు, కంది, ఉలువలు, అలసంద, పొద్దుతిరుగుడు, ఆముదం వంటివి ఉత్తమం. కాల్వ నీటిపై ఆధారపడే రైతులకు ఆగస్టు 15 వరకు రాాకపోవచ్చు. కాబట్టి వరి సాగు చేయడం మానుకోవాలి. కంది, మొక్క జొన్న, మినుములు, నువ్వులు సాగు చేయడంతోపాటు నీరు అందుబాటులో ఉంటే కూరగాయలు వేసుకోవాలి.
– చంద్రశేఖర్, జిల్లా వ్యవసాయాధికారి
●


