● సత్వర పరిష్కారానికి కృషిచేయాలి
● నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు
● కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సూచన
● ప్రజావాణి కార్యక్రమానికి 71 వినతులు
కందనూలు: ప్రజావాణిలో అందించే ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా సత్వరమే పరిష్కరిస్తూ బాధితులకు భరోసా కల్పించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో 71 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఒక్కో శాఖలో పెండింగ్లో ఉన్న ఫిర్యాదుల సంఖ్యను పరిశీలించి.. ఆలస్యానికి గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇకపై ఎలాంటి జాప్యానికి తావు లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వసతి గృహాలపై సమీక్ష
ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల నిర్వహణపై కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. ఒక్కో శాఖ అధికారి తప్పనిసరిగా ఒక వసతి గృహాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించాలని ఆదేశించారు. భవనాలు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, సిబ్బంది కొరత, భద్రత వంటి అంశాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని చెప్పారు. సమీక్ష సందర్భంగా ఇటీవల వివిధ వసతి గృహాలను పరిశీలించిన అధికారులు తమ నివేదికలను కలెక్టర్కు అందజేశారు. అమ్రాబాద్ ఎస్సీ బాలుర వసతి గృహంలో తాగునీటి సౌకర్యం సక్రమంగా లేదని, విద్యార్థుల కమిటీ ఇంకా ఏర్పాటు కాలేదని పేర్కొన్నారు. ఊర్కొండ వసతి గృహంలో గతంలో 33 మంది విద్యార్థులు ఉండగా, ప్రస్తుతం కేవలం 8 మంది మాత్రమే చేరారని, దీనికి ప్రహరీ లేకపోవడం, పారిశుద్ధ్య లోపం, పాముల బెడద వంటి సమస్యలు ప్రధాన కారణాలు అని అధికారులు వివరించారు. ఈ నివేదికలను పరిశీలించిన కలెక్టర్ క్షేత్రస్థా యి తనిఖీల ద్వారా సమస్యలను గుర్తించడమే కాకుండా వాటికి శాశ్వత పరిష్కార మార్గాలను కూ డా రూపొందించవచ్చన్నారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం, విద్యకు అనుకూల వాతావరణం కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యమని, అధికారులు నిరంత రం పర్యవేక్షణ కొనసాగించి సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.


