తిమ్మాజిపేట: ఓటర్ల ఎన్యూమరేషన్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల ఎలక్ట్రోరల్ ఆఫీసర్ చెన్నయ్య అన్నారు. శనివారం ఆయన మండలంలోని మరికల్లో ఎన్యూమరేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల నుంచి వివరాలు సేకరించాకే ఎన్యూమరేషన్ ఫాంలో నమోదు చేయాలని లేదా ఓటర్లు పూర్తి వివరాలు నమోదు చేసి వారి సంతకం తీసుకున్న తర్వాతనే ఫాం సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పారు. 2002 సంవత్సరంలో ఓటరుగా నమోదై ఉన్నవారు ప్రస్తుతం ఉన్న ఓటరు జాబితాలో సరి చూసుకోవాలని, ఏదైనా వివరాలు తప్పుగా ఉంటే ఓటరు సూచన మేరకు నమోదు చేసుకోవాలని బీఎల్ఓలకు సూచించారు. 40 ఏళ్ల వయసు గలవారికి గతంలో ఓటు హక్కు ఉండకపోవచ్చని, అయితే కుటుంబ సభ్యుల వివరాలు మ్యాపింగ్ చేసి పూర్తి వివరాలు వచ్చాక ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. రాజకీయ పార్టీల బీఎల్ఏలతో మాట్లాడుతూ.. ఓటరు మ్యాపింగ్ ప్రక్రియకు సహకరించాలని, అధికారులు అన్ని వివరాలు పూర్తి చేశాక చివరలో మీకు చూయించి మీ సంతకాలు తీసుకుంటారని పేర్కొన్నారు. బీఎల్ఓల పనితీరు బాగుందని, అధికారులు సైతం వారికి మంచి శిక్షణ ఇచ్చారని అభినందించారు. కార్యక్రమంలో ఆర్డీఓ అర్చన, తహసీల్దార్ జయంతి, సీసీలు కిరణ్, రవిచంద్ర, రమేష్, సీనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్, సర్పంచ్ ఉమాదేవి, ఉపసర్పంచ్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.


