కల్వకుర్తి రూరల్: గ్రామీణ స్థాయి క్రీడాకారులు ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే స్థాయికి ఎదగాలని, ఇందుకోసం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కల్వకుర్తి మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్ పోటీలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 150 మంది క్రీడాకారులు హాజరయ్యారు. పోటీలలో సత్తాచాటిన క్రీడాకారులను ఈ నెల 18న మెదక్ జిల్లాలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించే నాలుగో తెలంగాణ రాష్ట్ర మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ అథ్లెటిక్ 2026 పోటీల్లో పాల్గొననున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్నత విద్యతోపాటు క్రీడల్లో సత్తా చాటితే స్పోర్ట్స్ కోటా ద్వారా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉందన్నారు. యువత, విద్యార్థులు క్రీడలను తమ జీవనంలో భాగంగా చేసుకొని క్రమశిక్షణతో సాధన చేయాలని సూచించారు. అథ్లెటిక్స్లో ఉత్తమ ప్రతిభ చూపిన క్రీడాకారులకు ఆయన ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి స్వాములు, హెచ్ఎం బాలునాయక్, భిక్షపతి, అంజయ్య, శంషీర్ అనిల్, ప్రసాద్, బాలయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
టీఈడీఎక్స్ సదస్సుకు ప్రభుత్వ విప్
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: నోయిడాలో ఈనెల 4న టీఈడీఎక్స్ ఆధ్వర్యంలో జరిగే జాతీయ సదస్సులో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నియోజక వర్గంలో ‘మహబూబ్ నగర్ ఫస్ట్’ ఆధ్వర్యంలో చేపడుతున్న విద్యాభివృద్ధి కార్యక్రమాలను ఆయన వివరించనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను ప్రస్తావించనున్నారు.


