కల్వకుర్తి టౌన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు డీఎంహెచ్ఎస్ డా.కృష్ణ అన్నారు. గురువారం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రోగులకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం ఆస్పత్రి సూపరింటెండెంట్ శివరాం, వైద్యులు, నర్సింగ్ సూపరింటెండెంట్తో ఆయన సమావేశమై పలు సూచనలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 4న ఊర్కొండకు వస్తున్న నేపథ్యంలో కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. వీవీఐపీ ట్రీట్మెంట్ రూం సిద్ధం చేయడంతో పాటు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు క్రిటికల్ కేర్ వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఆస్పత్రిలో అవసరమైన మందులు, పరికరాలు, అంబులెన్స్, వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా డా.కృష్ణను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.


