తిమ్మాజిపేట: మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ముక్కిన బియ్యంతో భోజనం వడ్డిస్తున్నారు. కూరగాయలు సైతం నాణ్యతగా ఉండటం లేదు. కేజీబీవీకి వచ్చిన నాణ్యతలేని కూరగాయలను మంగళవారం ఇన్చార్జి ప్రత్యేకాధికారి తిప్పి పంపించారు. ఇక్కడ 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు 230 మంది బాలికలు చదువుకుంటున్నారు. కేజీబీవీలో సరిపడా సీఆర్టీలు, వర్కర్లు ఉండటంతో పాటు బాలికలకు పౌష్టికాహారం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పుష్కలంగా నిధులను మంజూరు చేస్తున్నాయి. విద్యార్థినులకు నాణ్యత కలిగిన బియ్యం, కూరగాయలతో భోజనం అందించాల్సి ఉండగా.. అధికారుల పర్యవేక్షణ లోపంతో వండిందే తినాల్సిన దుస్థితి నెలకొంది. కేజీబీవీలో తనిఖీల పేరిట అధికారులు చుట్టపు చూపుగా వస్తున్నారే తప్ప, విద్యార్థినులకు ఎలాంటి భోజనం అందుతుంది.. నాణ్యత ఎలా ఉందని తెలుసుకున్న పాపాన పోవడం లేదని పలువురు వాపోతున్నారు. విద్యార్థినులకు నాణ్యమైన ఆహా రం అందించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.


