ఏటూరునాగారం: వర్షాకాలం వచ్చిందంటే కరకట్టకు ఇసుక బస్తాలను అడ్డుకట్ట వేయాల్సిందే. గత ఐదేళ్లుగా రామన్నగూడెం నుంచి ఏటూరునాగారం వరకు ఉన్న గోదావరి కరకట్ట పలు చోట్ల గండ్లు పడి మట్టి కోతకు గురవుతుంది. ఇటీవల జియో ట్యూబ్స్తో కొంతమేర అడ్డుకట్ట వేసినా ఇటీవల వచ్చిన వరదలతో మరో రెండు చోట్ల కరకట్ట మట్టి ఒర్లిపోయింది. దీంతో వర్షాల తీవ్రతతో గోదావరి ఉధృతిగా వస్తే కరకట్ట కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. గమనించిన ఇరిగేషన్ అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా మంగళవారం రెండు చోట్ల ఇసుక బస్తాలను వేయించారు. ఉన్నతాధికారులు స్పందించి శాశ్వత నిర్మాణానికి కాంక్రీట్ వాల్ నిర్మించాలని రైతులు వాపోతున్నారు.


