● పుట్టుక.. చావులో పురుషులే ఎక్కువ
● సీఆర్ఎస్–24లో నివేదికలో ఉమ్మడి వరంగల్ ముఖచిత్రం
మొత్తం జననాలు: 57,156
మగ శిశువులు: 30,421,
ఆడ శిశువులు: 26,735
మొత్తం మరణాలు: 28,649
(పురుషులు: 17,441, మహిళలు: 11,208)
అత్యధిక జననాలు, మరణాలు: హనుమకొండ
అత్యల్ప జననాలు: ములుగు
అత్యల్ప మరణాలు: వరంగల్
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పుట్టుకై నా.. చావైనా.. మగవారిదే పైచేయి ఉంటోంది. అదే సమయంలో ఆడబిడ్డల జననాలు తగ్గడం కాస్త ఆందోళన కలిగే అంశంగా ఉంది. కేంద్ర జనగణన విభాగం ఇటీవల విడుదల చేసిన సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సీఆర్ఎస్) 2024 నివేదిక ప్రకారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో నమోదైన 57,156 జననాల్లో 30,421 మంది మగ శిశువులు, 26,735 మంది ఆడ శిశువులు ఉన్నారు. అంటే 3,686 మంది మగ శిశువులు ఎక్కువగా జన్మించారు. ప్రతి వెయ్యి మంది మగ శిశువులకు కేవలం 879 మంది ఆడ శిశువులే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. చిన్న కుటుంబాలవ్వడం, సంతానోత్పత్తి రేటు క్షీణించడం, కొన్ని ప్రాంతాల్లో సామాజిక అంశాలు ఆడపిల్లల జననాలపై ప్రభావం చూపుతున్నాయని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలాగే, ఉమ్మడి జిల్లాలో నమోదైన 28,649 మరణాల్లో 17,441 మంది పురుషులు, 11,208 మంది మహిళలు ఉన్నారు. అంటే 6,233 మంది పురుషులు ఎక్కువగా మరణించారు. మహిళలతో పోలిస్తే పురుషులు వ్యవసాయం, నిర్మాణం, రవాణా, పరిశ్రమలు వంటి ప్రమాదకర వృత్తుల్లో ఎక్కువగా ఉండడం, రోడ్డు ప్రమాదాలు, గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు, మద్యం, పొగాకు వినియోగం వంటి జీవనశైలి వల్ల మరణాలు ఎక్కువగా ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
జననాలు, మరణాలు
హనుమకొండలోనే ఎక్కువ
హనుమకొండ జిల్లాలో జననాలు, మరణాలు రెండూ అత్యధికంగా నమోదవగా, వరంగల్లో అత్యల్ప మరణాలు, ములుగులో అత్యల్ప జననాలు నమోదయ్యాయి. జననాల్లో ములుగు జిల్లాలో ప్రతి వెయ్యి మంది మగ శిశువులకు 991 మంది ఆడ శిశువులు ఉండడం సానుకూల సంకేతంగా కనిపిస్తోంది. మహబూబాబాద్ జిల్లాలో ఈ నిష్పత్తి 805కే పరిమితం కావడం ఆందోళన కలిగిస్తోంది. జననాల్లో ఆడబిడ్డల నిష్పత్తి పెరగడం, పురుషుల్లో జీవనశైలి వ్యాధులు, ప్రమాదాలను తగ్గించడం వంటి అంశాలపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాల్సిన అవసరముందని ఈ సీఆర్ఎస్ గణాంకాలు సూచిస్తున్నాయి.
జిల్లా జననం మరణం
మగ ఆడ మగ ఆడ
హనుమకొండ 13,464 11,920 8032 4,800
మహబూబాబాద్ 6,568 5,286 3185 2139
జనగామ 3,682 3,383 2,896 1,977
జయశంకర్ 3,189 2,875 1,198 740
వరంగల్ 2,056 1,822 774 447
ములుగు 1,462 1,449 1,356 1,105
ఆడపిల్లల జననాలను ప్రోత్సహించాలి
సీఆర్ఎస్–24 గణాంకాల ప్రకారం ఉమ్మడి వరంగల్లో ప్రతీ వెయ్యి మంది మగ శిశువులకు 879 మంది ఆడ శిశువులు నమోదవడం ఆందోళన కలిగించే అంశమే. బాలికల పుట్టుకను ప్రోత్సహించే పథకాలతో పాటు చట్టవిరుద్ధ లింగ నిర్ధారణపై కఠిన చర్యలు, సామాజిక అవగాహన కార్యక్రమాలు, బాలికల విద్య సంక్షేమానికి ప్రోత్సాహకాలు ప్రభుత్వాలు మరింత బలోపేతం చే యాలి. అప్పుడే లింగ నిష్పత్తి మెరుగుపడే అవకాశం ఉంటుంది.
– మండల పరశురాములు, సామాజికవేత్త, వరంగల్


